ఏపీలో కొత్త కేసులు తగ్గాయి- డిశ్చార్జ్ లు పెరిగాయి- కారణం తెలిస్తే షాక్...
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మొదలయ్యాక ప్రభుత్వం వేగంగా స్పందించి భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తోంది. దేశంలోనే అత్యధిక స్ధాయిలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రంగా కూడా రికార్డుల్లోకెక్కింది. కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు రాకముందే కరోనా పరీక్షల్లో ముందున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారీగా నిర్వహిస్తున్న కరోనా పరీక్షల కారణంగా ప్రతీ రోజూ దాదాపు 50 నుంచి 70 కేసుల మధ్యన కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా ఇవాళ ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్త కేసుల సంఖ్య కంటే రికవరీ అయి ఆస్పత్రుల నుంచి డిశ్చార్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వాస్తవంగా చూస్తే ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకోవాల్సిన అంశమే ఇది. కానీ దీని వెనుక కారణాలను గమనిస్తే మాత్రం పరిస్ధితిలో ఎక్కడో తేడా వచ్చిందని అర్ధమైంది.
కరోనా రోగులకు కేంద్రం ఊరట- తీవ్ర కేసుల్లోనే డిశ్చార్జ్ కు ముందు పరీక్షలు..
రాష్ట్రంలో కరోనా కొత్త కేసుల సంఖ్య కంటే డిశ్చార్జ్ ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం చెప్పిన లెక్కల వెనుక అసలు వాస్తవాలను గమనిస్తే రెండు రోజులుగా విజయవాడతో పాటు పలుచోట్ల టెస్టులు నిర్వహించడం లేదని తెలిసింది. కరోనా హాట్ స్పాట్ ప్రాంతంగా ఉన్న విజయవాడ నగరంలో ఐదు రోజుల నుంచి అనుమానితుల నుంచి సేకరించిన రక్తం శాంపిల్స్ ను పరీక్షించడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం కిట్ల కొరతే అని కృష్ణా జిల్లా వైద్యాధికారి రమేష్ తెలిపారు.
కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ ఎంతో ముందుంది. రాష్ట్రంలో దేశంగా ఎక్కడా లేనంతగా... ప్రతీ మిలియన్ జనాభాకూ 3091 పరీక్షలు నిర్వహిస్తోంది. తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం చూసినా గత 24 గంటల్లో 8388 టెస్టులు జరిగాయి. అయితే కొరియా నుంచి లక్ష కిట్లకు ఆర్డర్ చేసిన క్రమంలో అన్ని కిట్లు రాకపోవడమో.. వచ్చిన కిట్లన్నీ పరీక్షలకు వాడేయడమో జరిగింది. ఈ విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోయినా సాధారణ స్ధాయిలో టెస్టుల నిర్వహణకు శాంపిల్స్ సేకరణ జరిగినా పరీక్షలు పూర్తి కాకపోవడం వల్ల కొత్త కేసుల సంఖ్య కంటే డిశ్చార్జ్ లు అధికంగా నమోదైనట్లు అర్ధమవుతోంది.