ఏపీలో విజృంభిస్తున్న "స్క్రబ్ టైఫస్".. ఐదుకి చేరిన మృతుల సంఖ్య !!
ఆంధ్రప్రదేశ్లో 'స్క్రబ్ టైఫస్' విజృంభిస్తుంది. ఇప్పటికే దీని కారణంగా ఐదుగురు మృతి చెందగా.. వరుస మరణాలు చోటు చేసుకోవడం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మృతి చెందిన వారు విజయనగరం, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రాణాంతక వ్యాధికి నివారణ టీకా అందుబాటులో లేకపోవడంతో.. తక్షణ అప్రమత్తత, ముందు జాగ్రత్తలే ఏకైక మార్గమని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఈ కేసులు నమోదవుతున్నా కానీ ప్రస్తుతం వరుసగా ప్రజలు చనిపోతుండడం కలకలం రేపుతోంది.
కాగా శరీరంపై ఏదైనా కీటకం కుట్టినట్లు అనిపించినా.. కాలిన గాయంలాంటి మచ్చలు లేదా దద్దుర్లు కనిపించినా నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఒకటి, రెండు రోజులు ఉంటే తక్షణమే డాక్టర్ ని సంప్రదించాలని కోరుతున్నారు. 'స్క్రబ్ టైఫస్'కు సొంత వైద్యం ప్రాణాంతకం కావచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రాథమిక దశలో వైద్య పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించి, సరైన యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తే ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. ర్యాడిప్, వైల్-ఫెలిక్స్, ఐజీఎం ఎలీసా వంటి పరీక్షలతో దీనిని నిర్ధారించవచ్చని నిపుణులు పేర్కొన్నారు.

ఎలా వ్యాపిస్తుందంటే..?
ఇక 'ఓరింయెంటియా సుట్సుగముషి' అనే బ్యాక్టీరియా వల్ల 'స్క్రబ్ టైఫస్' వ్యాపిస్తుందని వెళ్లదీస్తున్నారు. నల్లిని పోలిన 'చిగ్గర్ మైట్' కీటకం కాటు ద్వారా ఇది మనుషులకు సంక్రమిస్తుందని.. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని స్పష్టం చేస్తున్నారు. ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు ఈ కీటకాల ఉనికికి వాతావరణం అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా పొలాల్లో, తోటల్లో పనిచేసే రైతులు, నిర్వహణ లేని గడ్డి మైదానాలు, తోటల్లో ఆడే పిల్లలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు.
వ్యాధి కట్టడి మార్గాలు..
- ఇంటి పరిసరాలు, పశువుల పాకలు శుభ్రంగా ఉంచుకోవడం
- తోటలు, గడ్డి, పొదలు ఉన్న ప్రాంతాలను తరచుగా చక్కదిద్దడం
- రాత్రి వేళల్లో ఈ కీటకాల సంచారం ఎక్కువగా ఉన్నందున, ఆరుబయట లేదా నేలపై నిద్రించకుండా ఉండడం
- ఇంట్లో ఎలుకలు, ఇతర కీటకాలు లేకుండా చర్యలు తీసుకోవడం
- పాత మంచాలు, ఫర్నిచర్ సందులు క్రమం తప్పకుండా శుభ్రం చేయడం
- పరుపులు, దుప్పట్లను పూర్తిగా దులిపి శుభ్రం చేసిన తర్వాతే వినియోగించడం
- పిల్లలు, పెద్దలు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం (స్క్రబ్ టైఫస్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది కాబట్టి వారి పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.)
మరణించిన వారి వివరాలు..
'స్క్రబ్ టైఫస్'తో మరణించినవారిలో విజయనగరం జిల్లాకు చెందిన సీహెచ్.రాజేశ్వరి (40, నవంబర్ 26), పల్నాడు జిల్లాకు చెందిన ఎం.జ్యోతి (10, నవంబర్ 1), బాపట్ల జిల్లాకు చెందిన ఎస్కే మస్తాన్బీ (43, నవంబర్ 14), పల్నాడు జిల్లాకు చెందిన వై.నాగమ్మ (64, నవంబర్ 16), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సంతోషి (5, డిసెంబర్ 4) ఉన్నారు.












Click it and Unblock the Notifications