AP Nominations: ఏపీలో నామినేషన్ల పరిశీలన ప్రారంభం-తేలనున్న లెక్క.. !
ఏపీలో నిన్నటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో 25 పార్లమెంట్ స్దానాలకు మొత్తం 1102 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 175 అసెంబ్లీ స్ధానాలకు 5960 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని ఇవాళ పరిశీలిస్తున్నారు. అనంతరం నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తిరస్కరిస్తారు. ఏప్రిల్ 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అనంతరం ఏప్రిల్ 30న బరిలో ఉన్న అభ్యర్ధులు ఖరారవుతారు. మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ స్ధానాలకు దాఖలైన నామినేషన్లలో అత్యధికంగా స్వతంత్ర అభ్యర్ధులే ఉన్నారు. ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీలతో పాటు గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్ధులు కూడా భారీగానే నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఒక్కో అభ్యర్ది ముందు జాగ్రత్తగా ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు కూడా దాఖలు చేశారు. వీటిని ఇవాళ అధికారులు పరిశీలించి డూప్లికేట్ నామినేషన్లను తిరస్కరిస్తారు. అప్పుడు జాబితాపై క్లారిటీ వస్తుంది.

అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకూ గడువు ఉంది. పలు చోట్ల పార్టీ టికెట్లు దక్కక రెబెల్స్ గా నామినేషన్లు దాఖలు చేసిన వారు వాటిని చివరి నిమిషంలో నేతల బుజ్జగింపులతో ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో నామినేషన్ల ఉపసంహరణ పర్వం కూడా కీలకం కానుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక ఈ నెల 30న బరిలో ఉన్న అభ్యర్ధుల తుది జాబితా ఖరారు చేస్తారు. అనంతరం ఈ పేర్లను ఈవీఎంలలో ప్రింటింగ్ కు పంపుతారు.












Click it and Unblock the Notifications