విశాఖలో 50 అడుగుల ముందుకు సముద్రం, పొంచి ఉన్న ముప్పు!
హైదరాబాద్/విజయవాడ: ఏపీలోని విశాఖ ఆర్కే బీచ్లో సముద్రం ముందుకు వచ్చింది. అలలు సబ్ మెరైన్ మ్యూజియం గోడకు బలంగా తాకుతున్నాయి. మ్యూజియం లోపలకు నీరు చొచ్చుకు వస్తోంది. ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు 50 అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం నాడు వర్షం కురిసింది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతోనే సోమవారం రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం కురిసిందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.
గత నెలలో ఏపీ, తెలంగాణలలో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. చెట్లు నేలకొరిగాయి. ఇళ్లు కూలాయి. గాలిలో తేమ, ఉష్ణోగ్రత పెరిగిన కొద్ది ఇలాంటి పెనుగాలుల ముప్పు ఉంటుందని చెబుతున్నారు.
ఉష్ణోగ్రత పెరిగితే క్యుములోనిబస్ మేఘాల వల్ల వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చి ఊహించని విధంగా గాలులు తీవ్ర నష్టాన్ని కలిగించే ప్రమాదముందని చెబుతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాదులో రెండుమూడు సార్లు భారీగా గాలులు వీచాయి. హోర్డింగులు, చెట్లు నేల కూలాయి. భారీ నష్టం జరిగింది. ఏపీలో కూడా భారీ వృక్షాలు నేల కొరిగాయి