5 రహస్యాలతో ఢిల్లీకి వైసీపీ: యనమల, మోడీకి చెప్పిందే జైట్లీకి: జగన్
హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రధానంగా ఐదు రహస్య అజెండాలతో ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం అన్నారు.
కేసుల మాఫీ, నిధులను అడ్డుకునేందుకే, అభివృద్ధిని అడ్డుకునేందుకు.. ఇలా పలు ప్రణాళికలతో ఆయన ఢిల్లీ వెళ్లాడని యనమల ఆరోపించారు. పట్టిసీమను రాజకీయం చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నాడన్నారు. డెల్టా ప్రజల్లో పట్టిసీమ పేరుతో జగన్ భయాందోళనలు రేకెత్తిస్తున్నాడన్నారు.
జగన్ జైలు గురించి భయపడాలి తప్ప పట్టిసీమ గురించి కాదని ఎద్దేవా చేశారు. ఈడీ వందల కోట్ల విలువైన ఆస్తులను జఫ్తు చేస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని వైయస్ జగన్ కలవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్ కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలని హితవు పలికారు.

నిమ్మల ఆగ్రహం
రాయలసీమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జగన్ తీరు ఉందని ఎంపీ నిమ్మల కిష్టప్ప మండిపడ్డారు. రాయలసీమ ప్రజల వల్లే జగన్ పార్టీకి ప్రతిపక్ష స్థానం దక్కిందని గుర్తు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయితే, తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని భయపడుతున్నారుని ఎద్దేవా చేశారు.
రెచ్చగొడ్తున్నారు: కంభంపాటి
జగన్ పొరుగు రాష్ట్రాలను ఏపీ పైకి రెచ్చగొడుతున్నారని కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసినవారు ఇటువంటి విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. పట్టిసీమపై జగన్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారన్నారు.
ఆర్థిక మంత్రితో జగన్ భేటీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పిన విషయాలనే తాను జైట్లీకి చెప్పానని చెప్పారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జైట్లీ చెప్పారన్నారు. అంతా మంచే జరుగుతుందని తాను భావిస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications