అక్కడ ఇదో తలనొప్పి!జ్ఞాన నిధి అని రాసి ఉంటే గుప్తనిధులు అనుకొని...రహస్య తవ్వకాలు
తూర్పుగోదావరి:గుప్తనిధుల పిచ్చి పరాకాష్టకు చేరితే ఏం జరుగుతుందనడానికి ఇదో ఉదాహరణ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నడిబొడ్డున ఉన్న మెక్లారిన్ హై స్కూల్లో గుప్త నిధులున్నాయని పదేళ్ల క్రితం ఉన్నట్లుండి విస్తృత ప్రచారం జరిగింది.
తొలుత ఈ నగరంలో మొదలైన పుకారు ఆ తరువాత జిల్లా వ్యాప్తంగా హల్చల్ చేసేసింది. దీంతో అక్కడ రహస్య తవ్వకాలు జరిగే అవకాశం ఉందని భావించిన ఆర్కియాలజీ విభాగం వారు ఆ స్కూల్ ఆవరణలో ఉన్న 200 ఏళ్ల నాటి పురాతన రాతి కట్టడాలన్నీ పరిశీలించి...అక్కడ గుప్త నిధులు లాంటివేమీ లేవని తేల్చేశారు. అయినా సరే అక్కడ అడపాదడపా దండగుల రహస్య తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి కారణం రాతికట్టడం పైనున్న ఒక పదం అని తెలిసింది.
కాకినాడలోని మెక్లారిన్ హై స్కూల్ విద్యా పరంగానే కాకుండా మరో కారణం చేత కూడా వార్తల్లోకెక్కుతోంది. అందుకు కారణం ఈ కాంపౌండ్ లో కొందరు దుండగులు జరిపే అక్రమ తవ్వకాలు. అడపాదడపా ఈ కాంపౌండ్లో కొందరు వ్యక్తులు రాత్రి వేళల్లో రహస్యంగా తవ్వకాలు చేస్తుండడాన్ని పాఠశాల యాజమాన్యం పసిగట్టి అలా జరగకుండా చూసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఆ క్రమంలో ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దుండగులను పట్టుకుని వారు దేహశుద్ధి చేశారు.
అయితే తాజాగా మరోసారి దుండగులు మళ్లీ రహస్య తవ్వకాలకు పాల్పడటంతో ఇదే తలనొప్పంటూ స్కూల్ నిర్వాహకులు తలపట్టుకుంటున్నారు. అసలు హై స్కూల్ ఆవరణంలో గుప్తనిథులు జరిగిన ప్రచారం వెనుక కారణాలు అన్వేషించేందుకు మళ్లీ క్షుణ్ణంగా పరిశోధించారు. ఆ తరువాత కారణం అర్థమై దుండగుల అమాయకత్వానికి నవ్వాలో...ఏడవాలో తెలియక తలపట్టుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే?...
కాకినాడలోని మెక్లారిన్ హై స్కూల్ ను 200 సంవత్సరాల క్రితం లండన్ మిషనరీకి చెందిన మెక్లారిన్ దంపతులు (బ్రిటీషర్లు) కట్టించారు. అంతేకాదు వాళ్లు చాలా కాలం ఈ స్కూల్ ఆవరణలోనే నివాసం ఉన్నారు. అప్పట్లో వాళ్లు ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక శిలాఫలకంపై క్రీస్తును ఆరాధించి, నిత్యం బైబిల్ చదవడం ద్వారా ఏసు బోధనల జ్ఞానం అబ్బుతోందని అనే అర్థంతో ఆ శిలా ఫలకంపై విస్ డమ్ ట్రెజర్ అని రాయించారు.
అయితే ట్రెజర్ అంటే నిధి కాబట్టి ఇక్కడ వాళ్లేదో నిధి దాచిపెట్టారని, అందుకే అలా రాయించారని అర్థం అన్వయించకున్న ఎవరో ఇక్కడ నిధి ఉందంటూ ప్రచారం చేశారు. ఆ క్రమంలో అక్కడ రహస్య తవ్వకాలు ప్రారంభమై అనేకమార్లు చోటుచేసుకుంటూనేవున్నాయి. ఈ క్రమంలో ఆ శిలాఫలకం ఉన్నచోటే కాదు మెక్లారిన్ దంపతులు నివసించిన అతి పురాతన రాతి కట్టడంలోనూ, స్కూల్ ఆవరణ వెనుక, ముందు ఇలా తమకు తోచినచోట దుండగులు నిధి కోసం తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. తాజాగా మళ్లీ ఈ తవ్వకాలు జరుపుకోవడంతో ఫిర్యాదు చేశారు.