అమరావతికి స్టాఫ్ తరలింపు: ఇలా వెళ్లలేం, వెళ్తాం కానీ...
హైదరాబాద్: హైదరాబాదు నుంచి నూతన రాజధానికి తరలిపోయే విషయంలో ఆంద్రప్రదేశ్ ఉద్యోగులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంత మంది తరలి వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేస్తుండగా కొంత మంది ఇలాంటి పరిస్థితిలో వెళ్లలేమంటూ విముఖత ప్రదర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తరలి వెళ్లేందుకు తమ రెవెన్యూ ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని ఎపి రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు చెప్పారు. బుధవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
విజయవాడలో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉన్నాయని, దీనిపై అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో ప్రధాన కార్యదర్శి చర్చించాలని ఆయన అన్నారు. గడువు దాటి పెండింగులో ఉన్న ఈ పాస్ బుక్కులను ఈ నెలాఖరులోగా పంపిణీ చేయాలని తహసీల్దార్ను కోరుతామని చెప్పారు. గ్రేడింగ్ విధానం గ్రామానికి, మండలానికి తప్ప అధికారులకు కాదని ఆయన స్పష్టం చేశారు.

కాగా, అమరావతికి తరలి వెళ్లే విషయంలో ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ కాస్తా విముఖత ప్రదర్శించారు. ఎపికి వెళ్లాలంటూ ఏకపక్షంగా సర్క్యులర్ జారీ చేశారని ఆయన బుధవారంనాడు అన్నారు. ప్రభుత్వంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
స్థానికతపై, 30 శాతం హెచ్ఆర్ఎపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తొలుత ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications