క్రెడిట్ దక్కవద్దనే!.. పీస్ఫుల్ సిటీలో 144సెక్షన్ స్వేచ్చను హరించడమే
హోదా ఉద్యమం ముందుకు సాగితే ఆ క్రెడిట్ అంతా జనసేన అధ్యక్షుడు పవన్ ఖాతాలోనో.. లేక వైసీపీ అధినేత జగన్ ఖాతాలోనో పడే అవకాశముంది కాబట్టి.. ప్రభుత్వం దీనిపట్ల కఠినంగానే వ్యవహరిస్తోంది.
విశాఖపట్నం: 'విశాఖ' పీస్ఫుల్ సిటీగా పేరున్న నగరం. ఇప్పటిదాకా అల్లర్లు.. గొడవలు.. శాంతికి భంగం కలిగించేవి చర్యలేవి ఇక్కడ చోటు చేసుకోలేదనే చెప్పాలి. అలాంటి ప్రశాంత నగరంలో ఇప్పుడు 144 సెక్షన్ విధించిన పరిస్థితి. ప్రజా ఆకాంక్షను ప్రభుత్వం అణిచివేసే దృక్పథమే తప్ప.. నిజంగా శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశముందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శాంతియుత పంథాలో విశాఖ యువత మౌనపోరాటానికి సిద్దమైతే ప్రభుత్వమెందుకు దాన్ని అణిచివేయాలనుకోవడం అని జనం ప్రశ్నిస్తున్నారు. కాపు ఉద్యమంలో భాగంగా జరిగిన తుని విధ్వంస ఘటనను హోదా ఉద్యమానికి ముడిపెడుతూ ప్రభుత్వం అతి జాగ్రత్త చర్యలు చేపడుతోందా? అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
తమ ఆకాంక్షను వెలిబుచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా.. ఎక్కడిక్కడ చెక్ పోస్టులు పెట్టి యువతను బీచ్ వైపు వెళ్లకుండా అడ్డుకోవడం పట్ల అక్కడి యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు తమ స్వేచ్చను హరించడమే అన్నది వారి వాదన.
అయితే హోదా ఉద్యమం ముందుకు సాగితే ఆ క్రెడిట్ అంతా జనసేన అధ్యక్షుడు పవన్ ఖాతాలోనో.. లేక వైసీపీ అధినేత జగన్ ఖాతాలోనో పడే అవకాశముంది కాబట్టి.. ప్రభుత్వం దీనిపట్ల కఠినంగానే వ్యవహరిస్తోంది.
ఇప్పటికైతే విశాఖలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. యువత మాత్రం బీచ్ వైపు తరలేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు నిర్బంధాలను గనుక చేధించుకుని వైసీపీ అధినేత జగన్ బీచ్ వద్దకు వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సి ఉంది.