కుప్పం పక్కలో ఇంత జరిగిందా, కొంప ముంచిన క్రికెట్ బాల్, ఆరా తీసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో క్రికెట్ బాల్ తగిలిందని జరిగిన గొడవల్లో రెండు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోవడంతో మూడు రోజులు అయినా ఆ ప్రాంతంో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరు జిల్లా కలెక్టర్, చిత్తూరు జిల్లా ఎస్పీ సంఘటనా స్థలంలోనే మకాం వేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి, బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుందాం అని, అందరూ ఓపికగా ఉండాలని టీడీపీ, బీజేపీ నాయకులు స్థానిక ప్రజలకు మనవి చేశారు.

చిత్తూరు జిల్లాలోని వీ. కోటలో సోమవారం స్థానిక యువకులు క్రికెట్ ఆడుతున్నారు. ఆ సందర్భంలో క్రికెట్ బాల్ ఓ మహిళకు తగిలింది. తర్వాత తనను క్రికెట్ బాల్ తో ఎందుకు కొట్టారు అంటూ ఆ మహిళ క్రికెట్ ఆడుతున్న యువకులను అక్కడే నిలదీసింది. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగిపోయింది. .ఆ తర్వాత సహనం కోల్పోయిన యువకులు కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్లు, కత్తులు తీసుకుని వెళ్లి మహిళా ఇంటి పైన, ఆ మహిళ బంధువుల ఇళ్ల పైన దాడి చేశారు.
ఇరు వర్గాల మధ్య గొడవ జరగడంతో పరస్పరం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలు దుకాణాలు ద్వంసం అయ్యాయి. విషయం తెలుసుకున్న వీ. కోట పోలీసులు, పలమనేరు డిఎస్పి కుప్పం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపు చేయడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ వీ. కోటకు చేరుకొని అక్కడే మకాం వేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.
మాజీ మంత్రి, పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి వి. కోటకు చేరుకుని ఇరు వర్గాల వారికి నచ్చచెప్పారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి వి. కోటలో 144 సెక్షన్ అమలు చేశారు బుధవారం మధ్యాహ్నం వరకు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. క్రికెట్ బాల్ మహిళకు తగిలిందని రెండు వర్గాల మధ్య గొడవ జరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీ. కోట గొడవలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.












Click it and Unblock the Notifications