‘ఆర్ఆర్ఆర్’ కు టిక్కెట్ ధరల ఎఫెక్ట్ - మీటింగ్ లో భిన్నాభిప్రాయాలు : ప్రభుత్వ వ్యూహం ఇదే..!!
ఏపీలో సినిమా టిక్కెట్ ధరల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించటం లేదు. సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు పైన టాలీవుడ్ ప్రముఖులు...ఎగ్జిబిటర్లు..డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వం తమ ఆలోచన మార్చుకోవాలని పదే పదే కోరారు. ఆ తరువాత ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్ల లో తనిఖీలు..మూసివేత చోటు చేసుకున్నాయి. దీంతో..ఒక దశలో భారీ బడ్జెట్ సినిమాలు ఆర్ఆర్ఆర్... రాధేశ్యామ్ తో సహా పలు సినిమాల విడుదల పైన సందేహాలు ఏర్పడ్డాయి. కానీ, మూవీ మేకర్స్ మాత్రం సినిమా చెప్పిన సమయానికే విడుదల అవుతాయని తేల్చి చెప్పారు.

ప్రభుత్వ కమిటీ సమావేశం
ఈ దశలో ప్రభుత్వం సినిమా థియేటర్ల యజమానులకు నెల రోజుల సమయం ఇస్తూ.. ఈ లోగా అన్ని అనుమతులు తీసుకోవాలని చెబుతూ..తిరిగి థియేటర్ల కొనసాగింపుకు అనుమతి ఇచ్చింది. ఇక, టిక్కెట్ల ధరల అంశం పైన ప్రభుత్వం సినీ సంఘాలతో సహా..ప్రభుత్వ అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ తొలి సమావేశంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సమావేశంలో పాల్గొన్న సినీ గోయర్స్, ఎగ్జిబిటర్ల వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసారు. ఆర్థిక, న్యాయ, రెవెన్యూ, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతోపాటు ఎగ్జిబిటర్లతో ఏర్పడిన కమిటీ శుక్రవారం వర్చువల్గా సమావేశమైంది.

భిన్నాభిప్రాయలతో వాయిదా
సినిమా టికెట్ల ధరలు, పట్టణ, గ్రామీణ ప్రాంతా ల్లో థియేటర్ల వర్గీకరణ, మౌలిక సదుపాయాలు, తినుబండారాల నాణ్యత, పార్కింగ్ ఫీజులు తదితర అంశాలపై చర్చించింది. టికెట్ ధరలు తగ్గించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని సినీ గోయర్ల సంఘం ప్రతినిధులు చెప్పగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇరువురి అభిప్రాయాలు విన్న కమిటీ చైర్మన్ విశ్వజీత్ జిల్లాల నుంచి జేసీల నివేదికలు తెప్పించుకుందామంటూ ప్రతిపాదించారు. దీనికి అందరూ ఓకే చెప్పారు. అయితే, ఈ నెల 7వ తేదీన భారీ బడ్జెట్ తో నిర్మించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది.

ఆర్ఆర్ఆర్ మూవీ పైన ప్రభావం
తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఆ సినిమాకు టికెట్ల ధర విషయంలో కొన్ని వెసులుబాట్లు కల్పించాయి. ఏపీలో కొనసాగుతున్న డైలమా పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ పైన టిక్కెట్ల ధరల ప్రభావం పడే అవకాశం ఉందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత దానయ్య పలు దఫాలుగా మంత్రి పేర్ని నానితో చర్చించారు.
కానీ, ప్రభుత్వం నుంచి మాత్రం భారీ బడ్జెట్ సినిమాలకు టిక్కెట్ల ధరల పెంపుకు అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపించటం లేదు. ఒక్కో సినిమాకు ఒక్కో విధానం.. హీరోలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండవని మంత్రి పేర్ని నాని తేల్చి చెప్పారు. అయితే, మరో ఆరు రోజుల సమయం ఉండటంతో ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి.. ధరల పెంపు కు అనుమతి పొందాలని ఆర్ఆర్ఆర్ నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

రాజమౌళి - దానయ్య- ప్రభుత్వం ఏం చేయనుంది
అయితే, ఇప్పటికే తాము కమిటీ ఏర్పాటు చేసినందున..ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల నుంచి వ్యక్తం అవుతుంది. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు... లో బడ్జెట్ సినిమాలకు ఒకే విధమైన టిక్కెట్ ధరలు వసూలు చేయటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశం పైన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
అయితే, ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో విడుదల లోగా ప్రత్యేకంగా పరిగణించి టిక్కెట్ ధరల విషయంలో మినహాయింపు ఇస్తుందా..ఇవ్వదా.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ ఏం చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది. అయితే, ప్రభుత్వం మాత్రం ఇక పూర్తిగా కమిటీకే బాధ్యతలు అప్పగించి..కమిటీ సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలనే భావనతో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications