జైపాల్ రెడ్డిపై సీమాంధ్ర నేతల చిటపటలు, టిడిపి వార్న్
హైదరాబాద్: సీమాంధ్ర నేతలది అజ్ఞానంతో కూడిన బాధ అని, ప్రకాశం పంతులు పుట్టిన నేలపై శుంఠలు పుట్టారన్న కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పైన పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావులా జైపాల్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ తహసిల్దార్ల సంఘం డైరీని జైపాల్ రెడ్డి ఆవిష్కరించిన అనంతరం సీమాంధ్ర నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే.
ఆయన వ్యాఖ్యలపై సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నేతలు తప్పు పట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు దుమ్మెత్తి పోశారు. జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. అదే సమయంలో ఢిల్లీలో చివరి బంతి ఉంటుందని, అక్కడ ఆడాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి జైపాల్ సూచించడం పైనా ఆయన స్పందించారు. తాము సరంజామా సర్దుకుంటున్నామని కౌంటర్ ఇచ్చారు.

రాజమండ్రి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ చర్చకు రావాలని కేంద్రమంత్రికి సవాల్ విసిరారు. జైపాల్ వంటి సీనియర్ నేత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్లా మాట్లాడటం విడ్డూరమన్నారు. జైపాల్ రెడ్డి శుంఠలు అని వ్యాఖ్యానించడం దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. సీమాంధ్రులను కించపర్చేలా మాట్లాడిన జైపాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, సీనియర్ రాజకీయవేత్తగా ఆయన హోదాకు తగదని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు అన్నారు. జైపాల్ విజ్ఞతకే వదిలేస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పింది.
తెలుగుదేశం పార్టీ మాత్రం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. జైపాల్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని యనమల రామకృష్ణుడు, నన్పనేని రాజకుమారి, దేవినేని ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. ఆయన వెంటనే సీమాంధ్రకు క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications