రిజైన్లు ఆమోదించండి, రాలేమని పిఎంతో చెప్పాం: చిరు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు నిరసనగా నలుగురు కేంద్రమంత్రులం రాజీనామా చేశామని, తాము కార్యాలయాలకు రాలేమని ప్రధాని మన్మోహన్ సింగ్తో చెప్పినట్లు కేంద్రమంత్రి చిరంజీవి తెలిపారు. సోమవారం ప్రధానితో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడారు. తాము చేసిన రాజీనామాలను ఆమోదించాలని ప్రధానిపై ఒత్తిడి చేసినట్లు ఆయన తెలిపారు.
మంత్రుల బృందంతో తమ సమస్యలను వ్యక్తపర్చాలని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తమకు చెప్పినట్లుగా ఆయన తెలిపారు. కేంద్రమంత్రులు పల్లం రాజు, కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, పురంధేశ్వరితోపాటు తాను రాజీనామా చేశానని ఆయన తెలిపారు. ప్రస్తుతం సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పదవిలో కొనసాగలేమని ప్రధానికి తెలిపినట్లు చిరంజీవి చెప్పారు. రాజీనామాలను ఆమోదించిన తర్వాత మంత్రుల బృందాన్ని కలిసే విషయాన్న ఆలోచిస్తామని చెప్పినట్లు తెలిపారు.
సీమాంధ్రుల అభిప్రాయన్ని ప్రధానికి వినిపించాం: పురంధేశ్వరి
ప్రధాని మన్మోహన్ సింగ్కు తన రాజీనామాను సమర్పించినట్లు కేంద్రమంత్రి పురంధేశ్వరి తెలిపారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రులు చిరంజీవి, కోట్ల సూర్య ప్రకాష్రెడ్డి తమ రాజీనామాలను ప్రధానికి సమర్పించారని తెలిపారు. మొత్తం నలుగురు కేంద్రమంత్రులు రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను ప్రధానికి వివరించామని పురంధేశ్వరి చెప్పారు.
ఆంటోనీ కమిటీ రాష్ట్రానికి వస్తుందని అనుకుంటున్న సమయంలో విభజన నోట్ను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడం బాధ కలిగించిందని పురంధేశ్వరి అన్నారు. విభజనతో సీమాంధ్ర ప్రజలు నష్టపోయామని భావిస్తున్నారని ప్రధానికి తెలిపినట్లు చెప్పారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని ప్రధానిని కోరినట్లు ఆమె తెలిపారు. తాము మంత్రులుగా అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనలేమని, కార్యాలయాలకు రాలేమని ప్రధానికి తెలిపినట్లు ఆమె చెప్పారు.
సమైక్యాంధ్రే మా ప్రధాన డిమాండ్ అని పురంధేశ్వరి అన్నారు. నోట్ ఆమోదించేముందు సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందని చెప్పారు. తాము పార్టీకి విధేయులమేనని, ప్రజల అభిష్టానికి అనుగుణంగానే రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు.