బాబును రప్పిస్తే బాగు: శ్రీకాంత్ రెడ్డి, వద్దులే: పుల్లారావు
హైదరాబాద్: పార్టీలకు అతీతంగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కూడా తీసుకుని వస్తే మంచిదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి ప్రతిపాదించారు. అయితే, చంద్రబాబును వదిలేద్దామని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసనసభ్యుడు పుల్లారావు అన్నారు.
విభజన కోసం తెలంగాణ శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా కలిసిపోయినట్లుగానే పార్టీలకు అతీతంగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర శాసనసభ్యులు కలిసి పోరాటం చేసే విషయంపై జెసి దివాకర్ రెడ్డి (కాంగ్రెసు), పుల్లారావు (తెలుగుదేశం), శ్రీకాంత్ రెడ్డి (వైయస్సార్ కాంగ్రెసు) మధ్య శనివారం శాసనసభ ఆవరణలో సంభాషణ జరిగింది.

తెలంగాణ శాసనసభ్యుల మాదిరిగా సీమాంధ్ర శాసనసభ్యులు కలిసి పోరాటం చేయాలని పుల్లారావు అన్నారు. అన్ని పార్టీల శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఈ సమయంలో శ్రీకాంత్ రెడ్డి కల్పించుకుని - చంద్రబాబును కూడా తీసుకుని వస్తే మంచిదని అన్నారు.
కాగా, శానససభ ఆవరణలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, శైలజానాథ్, బాలరాజు, కొండ్రు మురళి పాల్గొన్నారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications