బిల్లును వ్యతిరేకిస్తాం: బొత్స, అవి తెలంగాణవే: కోదండ
విజయనగరం/నల్గొండ: రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగ నిబంధనల ప్రకారమే జరగాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం విజయనగరంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీకి విభజన బిల్లు వస్తే సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తారని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసి ఐదు నెలలు కావస్తోందని, పద్ధతి ప్రకారం జరగాల్సిన శాసనసభ సమావేశాల్లో జాప్యం ఎందుకు జరుగుతుందో తెలియదని బొత్స తెలిపారు.
రాజ్యాంగ పరిధిలో పనిచేసే స్పీకర్, గవర్నర్ పదవులకు పవిత్రత ఉందని, ఆ పదవులపై రాజకీయం చేయడం తగదని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్జీవో నేతలు ఎమ్మెల్యేల నివాసాల ఎదుట ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అంతకుముందు విజయనగరం మున్సిపాలిటీలో సమస్యలు, అభివృద్ధి పనులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

భద్రాచలం, మునగాల తెలంగాణలోనే: కోదండరాం
నల్గొండ: భద్రాచలం, మునగాల తెలంగాణలో భాగమేనని, పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ జెఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండారం స్పష్టం చేశారు. గురువారం జిల్లాలోని మునగాల పరిగణణు తెలంగాణలోనే కొనసాగించాలంటూ విద్యార్థి జెఏసి చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంక్షలు లేని హైదరాబాద్ కావాలని, సంపూర్ణ అధికారాలు తెలంగాణ రాష్ట్రానికే ఉండాలని ఆయన అన్నారు.
సీమాంధ్ర పెట్టుబడిదారుల పెత్తనం నుంచి విముక్తి కోసమే తెలంగాణ పోరాటమని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలు శ్రీశైలం, సాగర్పై అవాస్తవాలు మాట్లాడుతున్నారని కోదండరాం అన్నారు. కాగా నల్గొండ జిల్లాలోని హోలియాలో గురువారం రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి జానారెడ్డి, పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. రచ్చబండ బ్యానర్పై ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఫొటోను తొలగించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్వల్ప గందరగోళం చోటు చేసుకోగా పోలీసులు అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications