టీ, సీమాంధ్ర ఉద్యోగులు: కొట్టుకున్నంత పని చేశారు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు ఆంధ్రపద్రేశ్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా రాష్ట్ర సచివాలయం వద్ద సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశపెడతారన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
కాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా పోలీసులు నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసుల బలగాల మధ్యే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్య రాష్ట్రానికి మద్దతుగా సీమాంధ్ర ఉద్యోగులు నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు వారికి వ్యతిరేకంగా, తెలంగాణకు మద్దతుగా నినాదాలు చేశారు.

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల ఉద్యోగుల తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో సచివాలయం ఆవరణ హోరెత్తింది. కొంత ఆగ్రహానికి గురైన ఇరు ప్రాంత ఉద్యోగులు తోపులాటకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసు బలగాలు అతి కష్టం మీద వారిని వారించారు. ముఖ్యమంత్రి నివాసం సి బ్లాక్ను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు.
ఇరు ప్రాంతాల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా తాము శాంతియుతంగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నామని సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేత ఒకరు తెలిపారు. తమకు పోటీగా ఆందోళనలు చేయడం వల్లే సమస్య మొదలైందని ఆయన అన్నారు. కాగా తెలంగాణ ఉద్యోగుల జెఏసి అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సీమాంధ్ర ఉద్యోగులు రాష్ట్ర విభజనకు అడ్డంకులు సృష్టిస్తే సహించబోమని హెచ్చరించారు.
సీమాంధ్ర నుంచి వచ్చిన చాలా మంది ప్రజలు హైదరాబాద్లో ఉంటున్నారని, సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనలు చేస్తూ శాంతియుత వాతావరణానికి భంగం కలిగించకూడదని అన్నారు. ఆందోళన జరుగుతున్న సమయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. నిసేధిత ప్రాంతంలో సీమాంధ్ర ఉద్యోగులు లౌడ్ స్పీకర్లను ఉపయోగించేందుకు, దిష్టిబొమ్మలను తగలబెట్టేందుకు అనుమతించడం ఆశ్చర్యకరంగా ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.












Click it and Unblock the Notifications