బిల్లును అడ్డుకోవాలి: కేంద్రమంత్రులకు అశోక్ హెచ్చరిక
హైదరాబాద్: సీమాంధ్ర కేంద్రమంత్రులు రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఏపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు హెచ్చరించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బిల్లును అడ్డుకోలేకపోతే కేంద్ర మంత్రులకు, ఎంపీలకు బుద్ధివచ్చేలా ప్రజలు వ్యవహరించాలని కోరారు. ప్రజల ఆందోళనల్లో తాము కూడా పాల్గొంటామని అశోక్ బాబు తెలిపారు.
సీమాంధ్ర కేంద్రమంత్రులు కలిసికట్టుగా నిలబడితే బిల్లు ఆగిపోతుందని అశోక్ బాబు అన్నారు. లేదంటే తాము పడ్డ కష్టాలకు, త్యాగాలకు ఫలితం లేకుండా పోతుందని చెప్పారు. బిల్లును అడ్డుకోలేని కేంద్రమంత్రులు, ఎంపీలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. బిల్లును అడ్డుకోలేకపోతే ప్రజల్లోకి రావాల్సిన అవసరం లేదని, వారిని రానియోద్దని ప్రజలను కోరుతున్నట్లు ఆయన చెప్పారు.
శుక్రవారం రాజ్యసభ సభ్యులకు ఎన్నికల జరిగిన తర్వాత తమ ఆందోళనలను ప్రారంభిస్తామని అశోక్ బాబు తెలిపారు. కేంద్ర కార్యాలయాలు, రహదారుల ముట్టడి చేపడుతామని తెలిపారు. ప్రజలందరూ ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 8, 9,10 తేదీల్లో తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని చెప్పారు. ఫిబ్రవరి 10న అమలాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
గుంటూరు, చిత్తూరు జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో కూడా సభలు నిర్వహిస్తామని అశోక్ బాబు చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. రాజ్యసభ ఎన్నికలు జరిగిన తర్వాత అఖిలపక్షంతో సమావేశం నిర్వహిస్తామని, ఆ తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని అశోక్ బాబు తెలిపారు. కేంద్రమంత్రులు కనీసం రాజ్యసభలోనైనా బిల్లును ప్రవేశపెట్టకుండా చూడాలని కోరారు. కేంద్రమంత్రులు చేతగానితనంతో ప్రజల ఉద్యమాన్ని నీరుగార్చొద్దని అన్నారు. తాము చేపట్టే ఆందోళనల్లో రాజకీయ పార్టీలు కలిసి రావాలని కోరారు.
బిల్లు పాస్ చేసేందుకు కుట్ర: ఉమ
రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు రాజకీయాల వల్లే ఆదాల ప్రభాకర్ రెడ్డి తన రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారని విమర్శించారు.
కిరణ్ లక్ష్యం నెరవేరింది: ఆనం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యమ లక్ష్యం నెరవేరిందని, కేంద్రం సీమాంధ్ర ఎంపీలను పిలిచి మాట్లాడుతోందని ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లు ఇడ్లీసాంబారు బిల్లులా మారిపోయిందన్నారు. తెలంగాణ బిల్లు మళ్లీ టేబుల్ ఐటెంగా తేవొద్దని ఆనం వివేకా కోరారు. రాష్ట్ర విభజన విషయంపై ఫ్లోర్ లీడర్లందరూ రాష్ట్రపతిని కలవాలని రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి కోరారు. రెండో ఎస్సార్సీయే తెలంగాణ సమస్యకు పరిష్కారమని ఆయన అన్నారు.