మూడు రాజధానులు తుగ్లక్ చర్య..వైయస్సార్ పైనా: మోదీ జోక్యం చేసుకోవాలి: శేఖర్ గుప్తా సంచలనం..!
ఏపీలో మూడు రాజధానుల రగడ పైన ప్రముఖ పాత్రికేయుడు..రచయిన శేఖర్ గుప్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తన మీడియా సమావేశంలో శేఖర్ గుప్తా ..ఏపీలో మూడు రాజధానుల మీద చేసిన విశ్లేషణ వీడియో ప్రదర్శించారు. రాజకీయ..ప్రభుత్వ వర్గాల్లోనూ ఆయన వ్యాఖ్యల మీద చర్చ జరుగుతోంది. అమరావతితో పాలకుల మీద తుగ్లక్ ప్రభావం బలంగా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ఆలోచన ఆచరణీయం కాదన్నారు. సీఎం జగన్ స్థానంలో వైయస్సార్ ఉంటే అలా చేసేవారు కాదని వ్యాఖ్యానించారు. అమరావతి నగర నిర్మాణం దేశానికి కావాలని చెప్పుకొచ్చారు. అమరావతి కొనసాగించాలని సీఎం జగన్ కు ప్రధాని మోదీ చెప్పాలని సూచించారు. ఇలాంటి పిచ్చి చర్యలను అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రపైన ఉందన్నారు.
ఐదేళ్లలో 5 వేల కోట్లు, లక్షా 10 కోట్లకు ఎన్నేళ్లు కావాలి, అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి పేర్ని
తుగ్లక్ డబుల్ కెఫీన్ తో 20 కప్పుల కాఫీ తాగి...
శేఖర్ గుప్తా ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన..అమరావతి నుండి రాజధాని తరలింపు నిర్ణయం పైన చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు కారణమయ్యాయి. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితుల్లో ఇవి మరింత హీట్ పెంచుతున్నాయ. శేఖర్ గుప్తా ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి నిర్మాణం నిలిపివేయటం.. మూడు రాజధానుల ప్రతిపాదన తెర పైకి తీసుకురావటాన్ని పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. మూడు రాజధానులతో పాటుగా రెండు హైకోర్టు బెంచీలపైన వ్యాఖ్యలు చేసారు. వేసవిలో శాసనసభా సమావేశాలు విశాఖలో జరుపుతారనే ప్రతిపాదన పైన తీవ్రంగా స్పందించారు. ఇదంతా చూస్తుంటే తుగ్లక్ డబుల్ కెఫీన్ తో 20 కప్పుల టీ తాగి తీసుకున్న నిర్ణయం లా ఉందంటూ వ్యాఖ్యానించారు.
వైయస్సార్ అలా చేసేవారు కాదు..
దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ గురించి శేఖర్ గుప్తా ప్రస్తావించారు. వైయస్సార్ దార్శనికుడని చెప్పుకొచ్చారు. జగన్ స్థానంలో ఆయన ఉంటే..చంద్రబాబు చేసిన పని కొనసాగించే వారన్నారు. కాకపోతే ఆ నగరంలో అన్ని ప్రాంతాలకు తమ పార్టీ లేదా కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకొనే వారేమో అంటూ వ్యాఖ్యానించారు. జగన్ అలా కాదని...శూన్యవాదని కామెంట్ చేసారు. ఏపీలో మొదట్నుంచి మంచి పారిశ్రామిక వేత్తలున్నారన్నారు. వారంతా కలిసి అమరావతిని అద్బుతంగా నిర్మిస్తారని..ఈ 60 ఏళ్లల్లో దేశంలో నిర్మించిన తొలి గ్రీన్ ఫీల్డ్ నగరం అవుతుందని భావించామని వివరించారు. కానీ, సీఎం జగన్ ఈ ప్రాజెక్టను నిలిపివేయాలని అనుకుంటున్నారని..తాజా బడ్జెట్ లో అమరావతికి రూ 500 కోట్లు మాత్రమే కేటాయించారని గుర్తు చేసారు.
ప్రధాని మోదీ ఏపీ సీఎంకు చెప్పాలి..
అమరావతిని కొనసాగించాలని ప్రధాని మోదీ ఏపీ సీఎం జగన్ కు చెప్పాలని శేఖర్ గుప్తా సూచించారు. ఇలాంటి పిచ్చి చర్యను అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందన్నారు. అమరావతిలో నిర్మాణాలను పునరుద్దరించాలని ప్రధాని నేరుగా జగన్ కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. ప్రభుత్వ ధోరణి కారణంగానే ప్రపంచ బ్యాంకు..ఏఐఐబీ..సింగపూర్ కన్సార్షియం.. వెనక్కు వెళ్లిపోయాయని చెప్పుకొచ్చారు. లులూ సహా చాలా సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులు విరమించుకొని వెళ్లిపోయాయని వివరించారు. ఒక ప్రభుత్వం ఒక ఆలోచన చేసి అయిదేళ్లలో దాన్ని ఒక స్థాయికి తెస్తే..తర్వాత వచ్చిన ప్రభుత్వ దాన్ని నాశనం చేస్తోం దని విశ్లేషించారు. అది అనర్ధదాయమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ రాజధాని తరలింపు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలకు..సంఘాలకు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న శేఖర్ గుప్తా చేసిన వ్యాఖ్యలు ఆయుధంగా మారుతున్నాయి. ఆయన ఈ విశ్లేషణతో వీడియో విడుదల చేసారు.