ముగ్గురి ప్రాణం తీసిన సెల్ఫీ సరదా: మృతుల్లో కొత్తగా పెళ్లైన యువకుడు, తెలుగుగంగలో..
చిత్తూరు: సెల్ఫీ సరదా ముగ్గురు యువకులు ప్రాణం తీసింది. సెల్ఫీ తీసుకుంటుండటంతో ఓ యువకుడు తెలుగంగ కాలువలో పడిన పడ్డాడు. అతడ్ని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు స్నేహితులు కూడా కాలువలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం ఉబ్బలమడుగు వద్ద చోటు చేసుకుంది.
తెలుగుగంగలో సెల్ఫీ దిగుతుండగా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 6న చెన్నైకి చెందిన నూతన దంపతులు ప్రియ, లోకేష్ ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రానికి బయల్దేరారు. మార్గమధ్యలో గుమ్మిడిపూండి వద్ద తన స్నేహితులైన కార్తీక్, బాలాజీ, యువరాజును కూడా తమ వెంట తీసుకెళ్లారు.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రాన్ని మూసివేయడంతో పక్కనే ఉన్న తెలుగుగంగ ప్రధాన కాలువ వద్ద కాసేపు సరదాగా గడిపేందుకు వెళ్లారు. కాలువ పక్కనే యువరాజు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అనుకోకుండా కాలుజారడంతో కాలువలో పడిపోయాడు.
యువరాజును కాపాడబోయి ముగ్గురు యువకులు గల్లంతు
గమనించిన స్నేహితులు లోకేష్(23), కార్తీక్(17), బాలాజీ(24) కాలువలోకి దూకి యువరాజును కాపాడబోయారు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఈ ముగ్గురు కూడా కాలువలో కొట్టుకుపోయారు. అయితే, యువరాజు మాత్రం నీటి ప్రవాహాన్ని ఎదురొడ్డి గట్టుకు చేరాడు. ఆ తర్వాత యువరాజు, ప్రియ కలిసి కాలువ వెంట కొంత దూరం వరకు వారి కోసం వెతికినా ప్రయోజనం లేకపోయింది. గల్లంతైన యువకులు ఎంతకూ తిరిగి రాకపోవడంతో గురువారం రాత్రి వరదయ్యపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Recommended Video
ఇద్దరి మృతదేహాలు లభ్యం, విషాదంలో కుటుంబాలు
వెంటనే స్పందించిన పోలీసులు.. కాలువ వెంట ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు సత్యవేడు మండలం రాచపాళెం సమీపంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని లోకేష్, బాలాజీలుగా గుర్తించారు. కార్తీక్ మృతదేహం కోసం తమిళనాడు పూండి కాలువ వరకు గాలించారు. అయినా అతని మృతదేహం లభించలేదు. సెల్ఫీ సరదా ముగ్గురి ప్రాణాలు తీయడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. కొత్తగా వివాహమైన లోకేష్ కూడా ఈ ఘటనలో మృతి చెందడంతో ఇరు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.