సంచలనం:కేంద్రానికి ఎపి ప్రభుత్వం షాక్...రాజధానిలో సంస్థలు ఏర్పాటు చేయనందుకు నోటీసులు
అయితే కేంద్రానికి సిఆర్డిఏ లేఖల వ్యవహారంపై దుమారం రేగుతోంది. దీంతో కేంద్రం-ఆంధ్రప్రదేశ్ మధ్య విభేదాల మరింత తీవ్రతరం అవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే...
అమరావతిలో కేంద్రీయ విద్యాలయం, ఎస్బీఐ, ఎల్ఐసీ, ఎఫ్సీఐ, పోస్టల్, పబ్లిక్ వర్క్స్ తదితర సంస్థలు ఏర్పాటుచేస్తామంటూ కేంద్రం ప్రకటించిన మీదట ఎపి ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధానిలో ఆయా సంస్థలకు భూములు కేటాయింపులు జరిపింది. అయితే నాలుగేళ్లు ఏళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో తీసుకున్న భూముల్ని తిరిగిచ్చేయాలంటూ సీఆర్డీఏ అధికారులు కేంద్రంలోని ఆయా శాఖలకు నోటీసులు పంపారు.
కేంద్రానికి నోటీసులు పంపిన విషయమై మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ మాట్లాడుతూ సంస్థలు భూములు తీసుకున్న మూడు నెలల్లోగా నిర్మాణాలు ప్రారంభించాలని, కానీ ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదని అందుకే నోటీసులు ఇచ్చామని చెప్పారు. అయితే కేవలం కేంద్రమే కాకుండా ఇలా పలు సంస్థలు భూములు తీసుకున్న విషయమై మంత్రి నారాయణను ప్రశ్నించగా నిర్మాణాలు ప్రారంభించని అన్ని సంస్థలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై కేంద్రం ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. మరోవైపు అయితే కేంద్ర సంస్థలకు నోటీసులపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు నోటీసులు పంపడాన్ని సమర్థిస్తుండగా మరికొందరు దీనివల్ల ప్రయోజనం ఉండకపోగా మరింత నష్టం వాటిల్లవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో భూముల కేటాయింపులు జరిపిన నాలుగేళ్లు కనీసం హెచ్చరించకుండా ఇప్పుడు ఉన్నట్టుండి నోటీసులు అంటూ హడావుడి చేయడం రాజకీయ లబ్ధికేనని విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సిఆర్డిఏ జారీ చేసిన ఈ నోటీసులపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.