సినీనటి అపూర్వకు ల్యాండ్ మాఫియా బెదిరింపులు...రాజకీయ నేతల ప్రమేయం?
పశ్చిమ గోదావరి:సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఎవరినీ ల్యాండ్ మాఫియా విడిచిపెట్టడం లేదు. తాజాగా ప్రముఖ సినీ నటి అపూర్వ భూ కబ్జాదారుల బారిన పడ్డారు. అపూర్వ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆమెకున్న పొలంపై కన్నేసిన కబ్జాదారులు దౌర్యన్యంగా సరిహద్దు రాళ్లు పీకేసిన ఘటన కలకలం రేపుతోంది.
సినీనటి అపూర్వకు తన సొంత ఊరైన దెందులూరులో నాలుగు ఎకరాల పొలం ఉంది. ఆ పొలానికి కొందరు దుండగులు సరిహద్దు రాళ్లను తొలగించడమే కాకుండా అదేమని ప్రశ్నించినందుకు బెదిరింపులకు దిగారు. దీంతో నటి అపూర్వ పోలీసులను ఆశ్రయించింది. మరోవైపు నటి అపూర్వకు చెందిన భూ కబ్జా పర్వం వెనుక కొందరు రాజకీయ ప్రముఖుల హస్తం ఉందన్న చర్చనీయాంశంగా మారింది.
నటి అపూర్వకి...భూ కబ్జా కష్టాలు
తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న నటి అపూర్వకు ఊహించని సమస్య ఎదురైంది. సొంత ఊర్లో ఈమెకున్న పొలాన్ని కొందరు దౌర్జన్యంగా కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దెందులూరులో తనకు నాలుగు ఎకరాల పొలం ఉందని...కొంత కాలంగా సరిహద్దు విషయమై తనకు పక్క పొలాల రైతులకు వివాదం నడుస్తోందని ఆమె పోలీసులకు చెప్పారు. ఈ వివాదం నేపధ్యంలో తాను ఇటీవలే స్ధానిక విఆర్ఓ సహకారంతో పొలంలో సరిహద్దు రాళ్లు వేయించానని చెప్పారు. అయితే వాటినికూడా తొలిగించేశారని, అదేమంటే బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దౌర్జన్యం...బెదిరింపులు...
స్వయంగా రెవిన్యూ అధికారి సహకారంతో వేసిన సరిహద్దు రాళ్లను తొలగించడమే కాకుండా తనను తీవ్రంగా దుర్భాషలాడారని...అదేమంటే బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు. పొలం సరిహద్దు వివాదం కారణంగా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా రాళ్లు వేసుకుంటుంటే వాటిని దౌర్జన్యంగా తొలగిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాము మళ్లీ రాళ్లు వేసుకుంటామని, ఆ సమయంలో తమకు పోలీసులు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. నటి అపూర్వ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు...రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఆమెకు హమీ ఇచ్చారు.
రాజకీయ ప్రముఖుల ప్రమేయం
అయితే ఈ భూ వివాద వ్యవహారంలో రాజకీయ ప్రముఖుల మస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే పోలీసులు అంతవేగంగా అప్రమత్తమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు నటి అపూర్వ కూడా తాను చట్టపరంగా భూమిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నానని...కానీ తనకు న్యాయం జరగకపోతే మీడియాను ఆశ్రయిస్తానని, అప్పుడు అన్ని విషయాలు మీకు చెబుతానంటూ మీడియాతో అనడం సంచలనం సృష్టిస్తోంది. అపూర్వ మాటలను బట్టి దీనివెనుక ఎవరో ప్రముఖులు ఉన్నారన్నట్లుగా ఉన్నాయని, అందుకే న్యాయం జరగకుంటే మీడియాను ఆశ్రయిస్తాననని ఆమె చెబుతోందని అంటున్నారని చర్చించుకుంటున్నారు.
భూ వివాదం...పోలీసుల వివరణ
నటి అపూర్వ తమకు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని పోలీసులు తెలిపారు. అయితే ఇది కేవలం సరిహద్దు వివాదమే తప్ప ల్యాండ్ కబ్జా వంటి వ్యవహారం కాదని పోలీసులు అంటున్నట్లు తెలిసింది. అంతేకాని ఈ విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కడా లేదంటున్నారు. అలా రాజకీయ నాయకుల ప్రమేయం ఉందంటూ ప్రచారం ఎలా ఎందుకు జరిగిందో తమకు తెలిదంటున్నారు. ఇది సాధారణ సివిల్ వ్యవహారం అని, అయితే అపూర్వ సినీ నటి...సెలబ్రిటీ కావడం వలన ఈ విషయం ఇంత ప్రాముఖ్యత సంతరించుకుందని పోలీసులు అంటున్నారు. అయితే సమస్య పరిష్కారం కాకపోతే మీడియాతో అన్ని విషయాలు చెబుతానని అపూర్వ మాట్లాడటం బట్టి ఆమె కోరుకున్న విధంగా జరగని పక్షంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.