పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు భారీ షాక్- బెయిల్ పిటిషన్లపై కీలక తీర్పు..!
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎంను ధ్వంసం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన పలు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కేసుల తీవ్రత దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పేసింది.

మే 13న మాచర్లలోని పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేయడం, అడ్డు వచ్చిన టీడీపీ ఏజెంట్లపై దాడికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో అరెస్టు కాకుండా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అప్పట్లో పిన్నెల్లి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే తొలుత ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ అరెస్ట్ కాకుండా ఊరటనిచ్చిన హైకోర్టు.. అనంతరం దాన్ని పొడిగించింది.
ఇవాళ ఈ నాలుగు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పిన్నెల్లి అరెస్టు కాకుండా బయట ఉంటే సాక్ష్యుల్ని భయపెట్టే అవకాశం ఉందని, ఆధారాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని ప్రాసిక్యూషన్ చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది. గతంలో పిన్నెల్లి అరెస్టు కాకుండా ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో త్వరలో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications