జగన్ సర్కార్ పై అమరావతి రైతుల మరో అస్త్రం-సీఆర్డీయే,రెరాకు నోటీసులు-మళ్లీ హైకోర్టుకు?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటివరకూ జరుగుతున్న అమరావతి పనుల్ని నిలిపేయడంతో పాటు రైతులకు ఇవ్వాల్సిన అభివృద్ధి చేసిన ప్లాట్లను కూడా ఇన్నాళ్లూ ఇవ్వలేదు. మూడు రాజధానుల నేపథ్యంలో రైతులు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆరునెలల్లో వారికి అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వాలని తీర్పులో చెప్పింది. అయితే ఇన్నాళ్లూ ఆలస్యానికి పరిహారం ఎవరిస్తారని ప్రశ్నిస్తున్న రైతులు.. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు పంపారు.
జగన్ సర్కార్ వర్సెస్ అమరావతి రైతులు
అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేసిన సీఆర్డీయే చట్టం ప్రకారం ఇప్పటికే ప్లాట్లను అభివృద్ధి చేసి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సి ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు మొగ్గు చూపడంలో ఆ ప్రక్రియ ఇన్నాళ్లూ నిలిచిపోయింది. దీంతో రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లను కూడా పూర్తిగా ఇవ్వలేదు. దీంతో ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్న రైతులకు హైకోర్టు తీర్పు కలిసి వస్తోంది. ఇందులో ఉన్న పలు అంశాల ఆధారంగా వారు ఇప్పుడు ప్రభుత్వంపై మరో దాడికి సిద్ధమవుతున్నారు.
సీఆర్డీయే, రెరాకు నోటీసులు
అమరావతిలో అభివృద్ధి చేసిన ఫ్లాట్లను ప్రభుత్వం తమకు సకాలంలో ఇస్తుందనే షరతుతో రైతులు నాడు రాజధాని కోసం భూములిచ్చారు. ఇప్పుడు ఆ ప్లాట్లను ఇప్పటివరకూ ఇవ్వకపోవడంతో రైతులు సీఆర్డీయే చట్టంలోని నిబంధనల్ని, హైకోర్టు తీర్పులో ప్రస్తావించిన అంశాల్ని ఆధారంగా చేసుకుని సీఆర్డీయే, రెరాకు నోటీసులు పంపారు.
గతంలో జరిగిన భూసమీకరణ సందర్భంగా తుది ప్రకటన ఇచ్చిన ఏడాదిలోగా ప్లాట్ల విభజన, రోడ్ల నిర్మాణం చేపట్టి భౌతికంగా వాటిని తమకు అఫ్పగించాల్సి ఉందని రైతులు పేర్కొన్నారు. మూడేళ్లలో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆ లెక్కన 2016 డిసెంబర్లో సీఆర్డీయే తుది ప్రకటన ఇచ్చిందని, దాని ప్రకారం మూడేళ్లలో ప్లాట్లు ఇవ్వకపోవడంతో పాటు మౌలికసదుపాయాలు అభివృద్ధి చేయలేదని వారు ఆరోపించారు.
ఎకరానికి 3 లక్షల పరిహారం
సీఆర్డీయే గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో తాము ఆర్ధికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఆదాయం లేక అప్పులపాలయ్యామని రైతులు నోటీసుల్లో పేర్కొన్నారు. జరిగిన జాప్యానికి పరిహారంగా నివాస ఫ్లాట్ కు నెలకు చదరపు గజానికి రూ.100 చొప్పున, వాణిజ్య ప్లాట్ కు నెలకు రూ.150 పరిహారంగా చెల్లించాలని రైతులు కోరారు. అలాగే సీఆర్డీయేకు స్వాధీనం చేసిన ప్రతీ ఎకరం వ్యవసాయ భూమికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. ఇందులో విఫలమైతే హైకోర్టును ఆశ్రయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాని సీఆర్డీయేకు పంపిన నోటీసుల్లో హెచ్చరించారు.
ప్రాజెక్టు రిజిస్టర్ చేయనందుకు రెరాకూ నోటీసులు
భూసమీకరణ చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం స్వచ్చందంగా భూములిచ్చిన వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని, దీనికి రెరా చట్టం కింద నమోదు చేయించాలని రైతులు గుర్తుచేశారు. సీఆర్డీయే ఈ ప్రాజెక్టుకు ప్రమోటర్ కాబట్టి, రెరాలో రిజిస్టర్ చేయించాలని తెలిపారు. రెరా చట్టం అమల్లో ఉన్నందు వల్ల ఇప్పటికే ఈ ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ చట్టం కింద రిజిస్టర్ చేయాలని, కానీ ఇప్పటివరకూ అలా చేయని సీఆర్డీయేతో పాటు రెరాకూ నోటీసులు పంపారు. ఇప్పటికైనా రెరా చట్టం ఉల్లంఘన జరిగినందున సీఆర్డీయే నుంచి తమకు పరిహారం ఇప్పించాలని రెరాను రైతులు కోరారు. దీనిపై వారం రోజుల్లోగా రెరా చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని రైతులు హెచ్చరించారు.
Recommended Video
జగన్ సర్కార్ పై మళ్లీ హైకోర్టుకు!
అమరావతిలో సీఆర్డీయే చట్టంలో పేర్కొన్న విధంగా రైతులకు ప్లాట్లు ఇవ్వడంతో రాజధాని పనులు చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన తీర్పే ఇప్పుడు వారికి ఆయుధంగా మారింది. హైకోర్టు తీర్పుతో రాజధానిలో సకాలంలో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వని వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో ఇప్పుడు రైతులు సకాలంలో ప్లాట్లు ఇవ్వని సీఆర్డీయేపైనా, అయినా ఏమీ మాట్లాడని రెరాపైనా కోర్టుకెక్కేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్ని చూస్తుంటే సీఆర్డీయే కానీ, రెరా కానీ రైతులకు పరిహారం ఇచ్చే పరిస్ధితులు కనిపించడం లేదు. దీంతో రైతులు మరోసారి హైకోర్టును ఆశ్రయించడం ఖాయంగా కనిపిస్తోంది.