జగన్కు కేంద్రం మరో బ్రేక్- ఈసారి మరింత ఘాటుగా- చంద్రబాబుకు ఊరటగా...
దేశవ్యాప్తంగా కరోనా తర్వాత పెట్టుబడుల రాక తగ్గింది. పెట్టుబడిదారుల్లో విశ్వాసం నానాటికీ తగ్గిపోతోంది. దేశంలో నెలకొన్న పరిస్ధితులతో పాటు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణం. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం పడుతోంది. దీంతో కేంద్రం నానా కష్టాలు పడి విదేశీ ప్రభుత్వాలను ఒప్పించి తీసుకొస్తున్న పెట్టబడులు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల మూలంగా వెనక్కి వెళ్లిపోతున్నాయి.
ఈ వ్యవహారంపై సమగ్ర సమీక్ష నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గత ప్రభుత్వాల నిర్ణయాలను తిరగతోడేందుకు వీల్లేకుండా ఓ ఒప్పందం కుదిర్చేందుకు సిద్ధమవుతోంది. ఇది ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు ప్రయత్నిస్తున్న జగన్ సర్కారుకు ఎదురుదెబ్బగా మారనుంది.
చంద్రబాబు హయాం ఒప్పందాలపై సమీక్ష..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలు చేసి పలు అంతర్జాతీయ సంస్ధలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి ప్రకారం ఏపీలో ఆయా దేశాలకు చెందిన సంస్ధలు పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలిగింది. అన్ని సంస్ధలు తక్షణం కాకపోయినా దశల వారీగా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి.
మరికొన్ని టీడీపీ హయాంలోనే పెట్టుబడులు పెట్టాయి. వీటిలో సంప్రదాయేతర విద్యుత్ ఒప్పందాలు ముఖ్యమైనవి. జగన్ సర్కారు అధికారంలోకి రాగానే వీటిని సమీక్షించడం ద్వారా రాష్ట్రానికి భారీగా ప్రభుత్వ ధనం ఆదా అవుతుందని జగన్ సర్కారు చెప్పింది. అనుకున్నట్లుగానే వీటిని సమీక్షించేందుకు సిద్ధమైంది. కానీ ఆయా సంస్ధలు న్యాయపోరాటానికి దిగడంతో ఈ వ్యవహారం పెండింగ్లో ఉంది.
ముందునుంచీ కేంద్రం అభ్యంతరాలు...
చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న సంప్రదాయేతర విద్యుత్ పంపిణీ కోసం చేసుకున్న ఒప్పందాల సమీక్షకు కేంద్రం ఎప్పుడో నో చెప్పేసింది. అంతర్జాతీయ సంస్దలతో కుదిరిన ఈ ఒప్పందాల సమీక్ష వల్ల పెట్టుబడిదారుల్లో భారత్పై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయినా కేంద్రాన్ని లెక్కచేయకుండా తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని జగన్ సర్కారు ముందుకెళ్లింది.
అయితే కోర్టుల్లో ఎదురుదెబ్బలతో ప్రస్తుతం తాత్కాలికంగా వీటి సమీక్షకు విరామం ప్రకటించింది. అయితే భవిష్యత్తులో అయినా జగన్ ప్రభుత్వం వీటిని సమీక్షించకుండా వదిలిపెట్టదని భావించిన ఇన్వెస్టర్లు కేంద్రాన్ని ఆశ్రయించారు. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల నిర్ణయాల వల్ల తమ పెట్టుబడులు సురక్షితం కాదని భావిస్తున్నట్లు వారు కేంద్రానికి మొరపెట్టుకున్నారు. దీంతో కేంద్రం దీనిపై సుదీర్ఘ సమీక్ష జరిపింది.
ఒప్పందాల సమీక్ష కుదరన్న కేంద్రం- జగన్కు షాక్
విద్యుత్ ఒప్పందాలే కాదు గత ప్రభుత్వాల హయాంలో కుదిరిన ఏ ఒప్పందం కూడా సమీక్షించడం కుదరదంటూ కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చేసింది. అంతే కాదు దీనిపై భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా రాష్ట్రాలతో రాతపూర్వక ఒప్పందాలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. దీంతో కేంద్రం పరిధిలోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఓ ముసాయిదా ఒప్పందం తయారు చేసింది. దీనిపై సంతకాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు దీన్ని కేంద్రం పంపింది.
గత ప్రభుత్వాల హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాల సమీక్షకు వీల్లేకుండా దీన్ని కేంద్రం రూపొందించింది. దీంతో చంద్రబాబు హయాం నాటి ఒప్పందాల సమీక్షకు ప్రయత్నాలు చేస్తున్న జగన్ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
Recommended Video
చంద్రబాబుకు భారీ ఊరట...
టీడీపీ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను సమీక్షించడం ద్వారా తనను ఇరుకునపెట్టాలని భావిస్తున్న జగన్ సర్కారుకు అడ్డుకట్ట వేసేలా కేంద్రం తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకు భారీ ఊరటనిచ్చింది. ముఖ్యంగా పలువురు టీడీపీ, బీజేపీ నేతలు పెట్టుబడిదారులుగా ఉన్న ఈ ఒప్పందాలను సమీక్షించకుండా కేంద్రం కొత్త ఒప్పందాన్ని తెరపైకి తీసుకురావడంపై ఇప్పుడు ఆయా పార్టీల్లో చర్చ కూడా జరుగుతోంది.
అయితే కేంద్రం నిర్ణయం మాత్రం కచ్చితంగా తమకు ఊరటగానే పెట్టుబడిదారులు భావిస్తున్నారు. కేంద్రం పంపిన ముసాయిదా ఒప్పందంపై జగన్ సర్కారు సంతకం చేయకుండా నిరాకరించే పరిస్ధితి లేకపోవడంతో భవిష్యత్తులో ఈ ఒప్పందాలు సేప్ అని చెప్పవచ్చు.