వైసీపీకి దిమ్మదిరిగే షాక్..! ఒకే రోజు టీడీపీలోకి ముగ్గురు ఎమ్మెల్సీలు..!
ఏపీలో విపక్ష వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతోంది. గతేడాది అధికారం కోల్పోయిన తర్వాత నుంచి వివిధ కారణాలతో పార్టీని వీడుతున్న నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదే క్రమంలో ఇవాళ ఒక్కరోజే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు. వీరంతా ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు గుడ్ బై చెప్పేశారు. అయితే టీడీపీలో చేరిక మాత్రం ఆలస్యమైంది. ఇవాళ వీరు పార్టీలో చేరేందుకు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీలు అయిన మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ వివిధ కారణాలతో ఆ పార్టీని వీడారు. జగన్ వైఖరి నచ్చలేదని ఒకరు, పార్టీలో ఇమడలేకపోతున్నట్లు మరో ఇద్దరు ప్రకటించారు. అయితే వీరు ముందుగానే టీడీపీ పెద్దలతో మాట్లాడుకుని ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే వీరు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అలాగే ఎమ్మెల్సీ పదవులు కూడా వదులుకున్నారు.

ప్రస్తుతం మండలిలో కూటమి కంటే వైసీపీకి మెజార్టీ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల వేళ మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీని పార్టీలో చేర్చుకోవడం ద్వారా పైచేయి సాధించాలని టీడీపీ భావిస్తోంది. దీంతో ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలుసుకుని వీరు ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం లాంఛనంగా మారింది.












Click it and Unblock the Notifications