ఇప్పటంలో కూల్చివేతలకు హైకోర్టు బ్రేక్- పంతం నెగ్గించుకున్న జనసేన !
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో సీఆర్డీయే అధికారులు ఇవాళ ఇళ్ల కూల్చివేతలకు దిగారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇప్పటికే నోటీసులు ఇచ్చిన అధికారులు.. ఇవాళ కూల్చివేతలు చేపట్టారు. దీన్ని గ్రామస్ధులు తీవ్రంగా ప్రతిఘటించారు. తమకు అవసరం లేని 120 అడుగుల రోడ్డు కోసం ఇళ్ల స్ధలాలు పోగొట్టుకోలేమని వారు అడ్డుకున్నారు. అయితే పోలీసుల సాయంతో అధికారులు కూల్చివేతలు సాగించారు.
ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరిపిన న్యాయస్ధానం.. కూల్చివేతలను ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ కూల్చివేతలు ఆపాల్సిందిగా హైకోర్టు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తోంది. కూల్చివేతల కారణంగా ఉదయం నుంచి ఇప్పటం గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్దితులు కూడా కాస్త శాంతించాయి.
గతంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామంలో ప్రజలు స్ధలం ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ సభ జరిగింది. ఈ సభలోనే పవన్ ఇప్పటం గ్రామానికి రూ.50 లక్షల ఆర్ధిక సాయం కూడా ప్రకటించారు. ఈ మొత్తం తమకు జమ చేయాలంటూ సీఆర్డీయే అధికారులు వింత డిమాండ్ మొదలుపెట్టారు. దీనికి ఇటు జనసేన కానీ, అటు గ్రామస్తులు కానీ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో గ్రామంలో ప్రస్తుతం ఉన్న 70 అడుగుల రోడ్డును 120 అడుగులకు విస్తరిస్తామంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఇందుకోసం గ్రామంలో ఇళ్లను కూల్చివేయడం మొదలుపెట్టారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలుకావడంతో కూల్చివేతలు ఆగిపోయాయి.