ఏపీ హైకోర్టులో ఏడుగురు ఐఏఎస్ లు హాజరు-స్కూళ్లలో రైతు భరోసా కేంద్రాల కేసు
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు వ్యవహారం ఇవాళ హైకోర్టులో కలకలం రేపింది. ఈ కేసులో విచారణకు ప్రభుత్వం నుంచి ఏకంగా ఏడుగురు ఐఏఎస్ అధికారులు హాజరు కావడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఓ అధికారి హైకోర్టుకు హాజరు కావడమే చర్చించుకునే పరిస్దితుల నుంచి ఏకంగా 7గురు అధికారులు విచారణకు హాజరుకావడంపై ప్రభుత్వంలోనూ చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్, బుడితి రాజశేఖర్, చినవీరభద్రుడు, శ్యామలరావు, ఎంఎం నాయక్, విజయ్ కుమార్ హైకోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో ప్రభుత్వం ఇప్పటివరకూ 1180 స్కూళ్లలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అంగీకరించింది. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఇందులో 450 నిర్మాణాలను వేరే ప్రాంతాలకు తరలించినట్లు కూడా తెలిపింది.

ప్రభుత్వ పాఠశాలల్లో రైతు భరోసా కేంద్రాలతో పాటు సచివాలయాల ఏర్పాటు వల్ల విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు గతంలోనే కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఇందుకు బాధ్యులైన ఏడు ప్రభుత్వ శాఖల అధికారుల్ని విచారణకు రావాలని ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం ఈ ఏడుగురు ఐఏఎస్ అధికారులు ఇవాళ హైకోర్టుకు వచ్చారు. వీరు సమర్పిచిన వివరణతో సంతృప్తి చెందిన హైకోర్టు...మరో నాలుగు వారాల్లో మిగిలిన నిర్మాణాలు కూడా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.
రాష్ట్పంలోని పాఠశాలల్ని నాడు-నేడు పథకం కింద రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం తిరిగి అందులోనే రైతు భరోసా కేంద్రాలతో పాటు సచివాలయాల్ని ఏర్పాటు చేయడంపై గతంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అసలే పాఠశాలలు స్ధలాభావంతో కుంచించుకుపోతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు ఉత్తర్వులతో ఇప్పటికే పలు నిర్మాణాలు తొలగించిన అధికారులు.. ఇప్పుడు మిగతా నిర్మాణాలపైనా దృష్టిపెట్టారు.












Click it and Unblock the Notifications