జగన్తో భేటీకి ఏడుగురు ఎమ్మెల్యేల డుమ్మా: దుష్ప్రచారం వద్దని శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: తమ పార్టీ శానససభ్యులు ఒక్కరొక్కరే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయిస్తున్న నేపథ్యంలో సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాదులోని లోటస్పాండులో జరిగిన ఈ సమావేశానికి ఏడుగురు శాసనసభ్యులు డుమ్మా కొట్టారు.
గైర్హాజరైన ఎమ్మెల్యేలు.. గౌరు చరిత (పాణ్యం) సుజయ కృష్ణ రంగారావు (బొబ్బిలి), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), మణిగాంధీ (కొడుమూరు), శివప్రసాద్ రెడ్డి (పొద్దుటూరు), గౌతమ్ రెడ్డి (నెల్లూరు). మరో ఇద్దరు ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలో ఉన్నారు. వీరి సమావేశాలకు హాజరు కాకపోవడానికి వ్యక్తిగత కారణాలను సాకుగా చూపారు.
సమావేశానికి హాజరైన శాసనసభ్యులు మాత్రం తాము జగన్ వెంటే ఉంటామని ప్రకటించారు. వైయస్ జగన్ తమకు బీ ఫారం ఇస్తేనే గెలిచామని, తాము జగన్ వెంటే ఉంటామని వారు చెప్పారు. టిడిపి తమ పార్టీ శాసనసభ్యులను ప్రలోభాలకు గురి చేస్తోందని వారు విమర్శించారు. తెలంగాణలో టిడిపి తుడిచి పెట్టుకుపోయిందని, అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తోందని అన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతో బేరాసారాలు మాని అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని శాసనసభ్యుడు గండికోట శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. వైయస్ జగన్తో సమావేశానికి అందుబాటులో ఉన్న శాసనసభ్యులంతా హాజరయ్యారని ఆయన చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాని ఎమ్మెల్యేలపై దుష్ప్రచారం చేయవద్దని ఆయన కోరారు.
పార్టీ మారిన శాసనసభ్యులు పదవులకు రాజీనామా చేసి ఉంటే బాగుండేదని అన్నారు. జగన్తో భేటీ తర్వాత నెల్లూరు జిల్లా శాసనసభ్యులు మీడియాతో మాట్లాడారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నీచులం కాదని వారన్నారు. టిడిపిలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి ఆ పార్టీ గుర్తుపై గెలవాలని వారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయవద్దని వారు సూచించారు. సత్యహరిశ్చంద్రుడిలా చంద్రబాబు నీతులు చెప్పడం మానుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications