విజయవాడలో 'సెక్స్ రాకెట్': అపార్ట్మెంటుపై దాడి, పట్టుబడ్డ నలుగురు..
విజయవాడలోని ముత్యాలంపాడు ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు బయటపెట్టారు.
విజయవాడ: విజయవాడలోని ముత్యాలంపాడు ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు బయటపెట్టారు. ఆ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్పై దాడి చేసి నలుగురు వ్యక్తులతో సహా ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు.
విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు సత్యనారాయణపురం పోలీసులతో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. రేవెళ్ల అన్నపూర్ణ(47) అనే మహిళ ఈ వ్యభిచార ముఠాలోని కీలక వ్యక్తిగా గుర్తించారు. బ్రోకర్ బొర్ర రామకృష్ణ(35), మరో ఇద్దరు విటులు ఎన్.శ్రీనివాస్ శర్మ, ఎక్కాల శ్రీనివాసరావు(40)లను అదుపులోకి తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కార్పోరేటర్ అపార్ట్ మెంటులో అన్నపూర్ణ అనే మహిళ ఫ్లాట్ ను అద్దెకు తీసుకుందని పోలీసులు తెలిపారు. రియల్ ఎస్టేట్ కార్యకలాపాల కోసం దీన్ని లీజుకు తీసుకుని వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్లాట్ లోపల రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించిన సమాచారంతో.. అచ్చు ఆ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేశారు.
గతంలో మూడు కేసుల్లో పట్టుబడిన అన్నపూర్ణపై పోలీసులు గత కొంతకాలంగా నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే సత్యనారాయణపురానికి ఆమె తన మకాం మార్చిందని గుర్తించారు. ఫోన్, ఇంటర్నెట్ ద్వారా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు అనుమానం రావడంతో.. గురువారం రాత్రి దాడులు చేశారు. దాడుల్లో పట్టుబడిన నలుగురిని అరెస్ట్ చేసి నలుగురు యువతులను కౌన్సెలింగ్ కు పంపించారు.