కెసిఆర్కు చూపిస్తాం: షబ్బీర్, ఓయులో దిష్టిబొమ్మ దగ్ధం
హైదరాబాద్: కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 100 రోజులు పాలన పూర్తవగానే కాంగ్రెస్ దమ్ము ఏంటో చూపిస్తామని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామలన్నింటినీ నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డిమాండ్ చేశారు.
లక్ష రూపాయల లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడేమో కేవలం పంటరుణాలు మాఫీ అనడం తగదని ఆయన గురువారం మీడియా సమావేశంలో అన్నారు. తెరాస ఏదో చేయాలన్న తపనతో అబాసుపాలు అవుతోందన్నారు. కబడ్డి కబడ్డి అంటూ పోతుంది కానీ తెరాస పాయింట్ తెచ్చుకోవట్లేదని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు.
రుణమాఫీకి అర్హులెవరో తేల్చాలని మాత్రమే నిబంధనలు జారీ చేశారని, రుణమాఫీ ఊసే ఉత్తర్వుల్లో లేదని ఆయన అన్నారు. రుణాలు మాఫీ అవుతాయో లేదో అనే ఆందోళనతో రాష్ట్రంలోని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు.

కెసిఆర్ బంగారు తెలంగాణ నిర్మిస్తారని అనుకుంటే ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రైతులను మోసగించడం మానుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేకంగా ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మీడియాలో ఊదరగొట్టిన విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పుడు ఆచూకీ లేకుండా పోయారని ఆయన అన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు.
ఇదిలావుంటే, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వద్దంటూ గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అందుకు నిరసనగా విద్యార్థులు కెసిఆరప్ దిష్టిబొమ్మను దహనం చేశారు.












Click it and Unblock the Notifications