డుమ్మా: జగన్కు షర్మిల ఝలక్, వైవి సుబ్బారెడ్డి అలక!
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. సోమవారం ప్రారంభమైన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వైయస్ జగన్ సోదరి షర్మిల, సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి గైర్హాజరయ్యారు. జగన్తో విభేదాల కారణంగానే వారు సమావేశానికి దూరంగా ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
గత కొంతకాలంగా జగన్కు షర్మిల దూరంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీ బలోపేతం కోసం షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

అయితే జగన్ జైలు నుండి విడుదలయ్యాక షర్మిల దూరం పాటిస్తున్నారట. అందుకు కడప పార్లమెంటు టిక్కెట్ తనకు నిరాకరించడమే కారణమని చెబుతున్నారు. జైలు నుండి వచ్చాక జగన్ రెండుసార్లు ఇడుపులపాయ వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అప్పుడు ఆయన వెంట షర్మిల లేరు. అంతేకాదు వారం రోజుల క్రితం ఆమె ఒంటరిగా ఇడుపులపాయలో నివాళులు అర్పించారు. ఇది చర్చనీయాంశమైంది.
మరోవైపు వైవి సుబ్బారెడ్డికి జగన్కు మధ్య కూడా గ్యాప్ పెరిగిందంటున్నారు. ఒంగోలు పార్లమెంటు టిక్కెట్ పైన హామీ లేకపోవడంతో వైవి అలక వహించారంటున్నారు. వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. కాగా, వారం రోజుల క్రితం వైవి సుబ్బారెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications