విజయమ్మ కోసం షర్మిల ప్రచారం: బాబుపై నిప్పులు
విశాఖపట్నం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కక్షగట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించారని ఆయన సోదరి షర్మిల ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతోపాటు ఆమె విశాఖపట్నంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం తమ కుటుంబానికి రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారని అన్నారు.
‘మీరు కాదు.. మేమే మీకు రుణపడి ఉన్నాం'అని ఆమె ప్రజలనుద్దేశించి అన్నారు. ఇప్పుడు మేము మీ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని షర్మిల చెప్పారు. వైయస్ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైయస్ను ముఖ్యమంత్రి చేశారని.. ఆ రుణం తీర్చుకోవడానికి తమకు ఇప్పుడు ఒక్క అవకాశం ఇవ్వాలని షర్మిల కోరారు. విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న వైయస్ విజయమ్మను చరిత్రలో నిలిచిపోయే విధంగా గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయం దండగా అన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. అధికారం కోసం రుణమాఫీ అంటు మాయమాటలు చెబుతున్నారని షర్మిల ఆరోపించారు. చంద్రబాబును 25ఏళ్లుగా గెలిపించుకుంటున్న కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏమి చేయలేదని, కుప్పం పంచాయతీని కూడా మున్సిపాల్టీగా చేయలేదని అన్నారు. అలాంటి చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటున్నాడని షర్మిల విమర్శించారు.












Click it and Unblock the Notifications