అనుకున్నదే అయింది: వైసీపీలోకి శిల్పాచక్రపాణి, టీడీపీకి రాజీనామా
టీడీపీలో తన సభ్యత్వానికి శిల్పా చక్రపాణి బుధవారం రాజీనామా చేశారన్న వార్తలు వస్తున్నాయి.
కర్నూలు: అనుకున్నదే అయింది.. సోదరుడి బాటలోనే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా పయనిస్తున్నారు. భుజం మీద టీడీపీ కండువా తీసి.. వైసీపీ కండువాతో దర్శనమిచ్చేందుకు సిద్దమైపోయారు. ఈ మేరకు కార్యకర్తలు, అనుచరులతో చాలాసేపు భేటీ అయిన శిల్పా చక్రపాణి.. ఇక టీడీపీని వీడేందుకే నిర్ణయించుకున్నారు.
కార్యకర్తలతో భేటీ అనంతరం టీడీపీలో తన సభ్యత్వానికి శిల్పా చక్రపాణి బుధవారం రాజీనామా చేశారు. గురువారం నంద్యాలలో జరగబోయే వైసీపీ బహిరంగ సభలో ఆయన ఆ పార్టీలో చేరనున్నారు. ఇదే విషయమై చర్చించడానికి.. ఇప్పటికే నంద్యాల నుంచి ఆయన హైదరాబాద్ బయలుదేరారు.
శిల్పా డిమాండ్లకు టిడిపి నో, ఆపరేషన్.. జగన్కు అలా షాకిచ్చే వ్యూహం!
2019లో శ్రీశైలం అసెంబ్లీ టికెట్ పై జగన్ నుంచి హామి పొందిన తర్వాతే శిల్పా చక్రపాణి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అంతకుముందు టీడీపీ ముందు కూడా ఇదే డిమాండ్ వినిపించిన ఆయన.. అక్కడి నుంచి సరైన హామి రాకపోవడంతోనే పార్టీని వీడాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
దీనికి తోడు పార్టీలో తనకంతగా ప్రాధాన్యం లభించడం లేదని శిల్పా చక్రపాణి చాలాకాలంగా భావిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి అఖిలప్రియకు ఇచ్చిన ప్రాధాన్యత తనకు దక్కకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. నిన్న మొన్న వచ్చిన వారికి పెద్ద పీట వేసి.. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కనపెడుతుండటం ఆయనకు మింగుడుపడలేదు.
ఇదే క్రమంలో సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి సైతం పార్టీని వీడటంతో.. టీడీపీలో చక్రపాణిరెడ్డి కొనసాగుతారా? అన్న దానిపై మీమాంసపై మొదలైంది. ఇటీవల ఇద్దరు సోదరుల మధ్య జరిగిన భేటీతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
ఏదేమైనా టీడీపీని వదిలి సోదరుడితో పాటే తానూ వైసీపీలో కొనసాగాలని శిల్పా చక్రపాణి రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. టీడీపీని వీడనున్న నేపథ్యంలో.. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.