బాబుకు శిల్పామోహన్ షాక్: రెండ్రోజుల్లో జగన్ పార్టీలోకి, అంతా అఖిలప్రియ వల్లే!
చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గట్టి షాకిచ్చారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గట్టి షాకిచ్చారు. టీడీపీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఇప్పటికే శిల్పా మోహన్ రెడ్డి కసరత్తులు పూర్తి చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మరోసారి అనుచరులు, కార్యకర్తలు భేటీ అవుతున్నారు శిల్పా మోహన్ రెడ్డి.
రెండ్రోజుల్లో జనగ్ పార్టీలోకి
మంగళవారం లేదా బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. గత కొంతకాలం క్రితం వైసీపీ నుంచి నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. గుండెపోటుతో తండ్రి భూమా నాగిరెడ్డి అకాల మరణం చెందడంతో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు భూమా అఖిలప్రియ.
అఖిలప్రియ దూకుడు వల్లే..
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భూమా అఖిలప్రియ నంద్యాలలో దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఎక్కువ కార్యక్రమాలు అక్కడే చేపడుతూ శిల్పాకు చెక్ పెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు తెలిసింది. దీంతో టీడీపీ అధిష్టానం కూడా అఖిలకే ప్రాధాన్యతనిస్తోందనే భావనతో ఉన్న శిల్పామోహన్ రెడ్డి ఆ పార్టీలో ఉండలేకపోతున్నట్లు తెలుస్తోంది.
ఇదే ప్రధాన కారణం
అంతేగాక, నంద్యాల ఉప ఎన్నికలు జరిగితే తనకే టిక్కెట్ ఇవ్వాలని శిల్పా పట్టుబట్టారు. అయితే, భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ కావడంతో తమ కుటుంబంలోని వారికే టికెట్ కేటాయించాలని అఖిలప్రియ అధిష్టానాన్ని పట్టుబట్టింది. దీంతో టీడీపీ అధిష్టానం శిల్పా మోహన్ రెడ్డికి సరైన హామీ ఇవ్వలేకపోయింది. శిల్పా మోహన్ రెడ్డి టీడీపీని వీడటానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అప్పట్లో బ్రేకులు వేసిన బాబు
గతంలో కూడా టీడీపీని వీడుతున్నట్లు వార్తలు రావడంతో అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు శిల్పా సోదరులు మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డిలను అమరావతికి పిలిపించి వారితో చర్చించి బుజ్జగించారు. అప్పటికి మెత్తబడినా.. తాజాగా వైసీపీలో చేరేందుకు సిద్ధమవడం రాజకీయ చర్చకు తెరలేపింది.
మొదటి నుంచి భూమాను వ్యతిరేకిస్తున్న శిల్పా
2009లో నంద్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన శిల్పా మోహన్రెడ్డి.. రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిల మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజల్లో కాంగ్రెస్ వ్యతిరేకత పెరగడంతో ఆయన ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్పై పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గం పార్టీ ఇంఛార్జీగా కొనసాగుతున్నారు. కాగా, రాజకీయ సమీకరణలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 2016 జనవరిలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియలను పార్టీలోకి చేర్చుకున్నారు. భూమాతో కలిసి సమన్వయంతో పనిచేయాలని శిల్పాకు సీఎం చంద్రబాబు పలుమార్లు సూచించారు. అయితే భూమా చేరికను వ్యతిరేకిస్తూ వచ్చిన శిల్పా మోహన్రెడ్డి నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఒకే పార్టీలో ఉన్నా ఒకరిపై ఒకరు వాడి విమర్శలు సంధించుకున్నారు.
వైసీపీ టికెట్పై పోటీ చేస్తారా?
కాగా, ఇటీవల భూమా నాగిరెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందారు. దీంతో నంద్యాల టికెట్ తనకే ఇవ్వాలని శిల్పా మొదటి నుంచి అధిష్ఠానానికి ఘాటుగా చెబుతూ వచ్చారు. తమ కుటుంబానికి చెందిన యువనేత భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తారని మంత్రి భూమా అఖిలప్రియ చెబుతూ వచ్చారు. అధిష్టానం తన మాట పట్టించుకోవడంలేదని భావించిన శిల్పా మోహన్ రెడ్డి చివరకు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శిల్పా మోహన్ రెడ్డి.. జగన్ పార్టీలో చేరితే నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేసే అవకాశాలున్నాయి. నంద్యాల టికెట్ హామీతోనే ఆయన వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం.