రోజా! నోరు అదుపులో పెట్టుకో, వారిదీ తప్పే: శివసేన హెచ్చరిక, టిడిపి హ్యాపీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా పైన శివసేన మండిపడింది. పవిత్ర తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా పైన శివసేన మండిపడింది. పవిత్ర తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
భక్తిపారవశ్యంతో నిండి ఉండే తిరుమల ఆలయం వద్ద రాజకీయాలు మాట్లాడటం ఏమిటని, అలాంటి వ్యాఖ్యల ద్వారా ఆలయ పవిత్రతకు రోజా భంగం కలిగిస్తున్నారంటూ మండిపడింది.
రాజకీయపరమైన కామెంట్లతో తిరుమలను అపవిత్రం చేస్తే, చూస్తూ ఊరుకునేది లేదని శివసేన నేత హెచ్చరించారు. తిరుమలకు వచ్చినప్పుడు నోరు అదుపులో పెట్టుకుని వ్యవహరించాలన్నారు.
ఈ మేరకు శివసేన జిల్లా కన్వీనర్ ఓంకార్.. రోజాపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమండ్ చేశారు. ఆమె పబ్లిసిటీ కోసమే చేస్తున్నారన్నారు. టిటిడి నిబంధనల మేరకు తిరుమలలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని, రోజా వ్యాఖ్యలను అన్ని పార్టీలు, అలాగే హిందూ సంఘాలు ఖండించాలన్నారు.
రోజా మరోసారి తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఆమెపై చట్టపరంగా పోరాడుతామన్నారు. రోజా రాజకీయాలు మాట్లాడినా టిటిడి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. హిందు సంస్థలు, ఇతర పార్టీలతో కలసి టిటిడి ఈవోకు మెమోరాండం ఇస్తామన్నారు. రోజాపై చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు.
తప్పుబట్టిన టిడిపి
వైసిపి ఎమ్మెల్యే రోజా పలుమార్లు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె వెలుపల మీడియాతో మాట్లాడుతూ టిడిపిని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. రోజా తీరును టిడిపి నేతలు కూడా తప్పుబట్టారు.
రోజా కౌంటర్
టిడిపి విమర్శలకు రోజా కూడా కౌంటర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలు మరిచిపోయారని, తిరుమల సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదాను పక్కన పెట్టారని, అలాంటప్పుడు తనను విమర్శించడం ఏమిటని నిలదీశారు.
టిడిపికి అండ
ఇప్పుడు రోజాపై శివసేన నేత విమర్శలు గుప్పించారు. ఇది టిడిపికి బలమనే చెప్పవచ్చు. పవిత్ర తిరుమల క్షేత్రంలో రాజకీయ విమర్శలు చేయవద్దని టిడిపి అంటోంది. ఇప్పుడు శివసేన జిల్లా నేత అదే సూచనలు చేశారు. శివసేన తప్పుబట్టడం టిడిపికి సంతోషాన్నే కలిగిస్తుందనే చెప్పవచ్చు.
చంద్రబాబు అంటేనే..
రోజా తొలుత టిడిపిలో ఉన్నారు. 2009లో టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో వైసిపి తరఫున నగరి నుంచి పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు అంటేనే ఆమె అంతెత్తున లేస్తారు.