కారు ప్రమాదం: అపస్మారక స్థితిలో శోభానాగిరెడ్డి
రాత్రి పదిన్నర గంటల సమయంలో షర్మిలకు వీడ్కోలు పలికి తన మిత్సుబిషి ఔట్ల్యాండర్ వాహనంలో శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డకు బయలుదేరారు. మరి కొన్ని నిమిషాల్లో ఆళ్లగడ్డకు చేరుకుంటారనగా గూబగుండం మిట్ట సమీపంలోని జాతీయ రహదారిపై స్థానిక రైతులు వేసిన ఆరబోసిన ధాన్యపు కుప్పల్లోకి ఆమె ప్రయాణిస్తున్న వాహనం దూసుకెళ్లింది.
ఒక్కసారిగా అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టింది. రోడ్డుపక్కనే ఉన్న పొలంలో పడిపోయింది. వాహనంలో ముందు సీటులో కూర్చున్న శోభా నాగిరెడ్డి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె మెడ, తల భాగానికి గాయాలయ్యాయి.
అపస్మారక స్థితిలో ఉన్న శోభా నాగిరెడ్డిని అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమెను ఐసీయూలో చేర్చారు. శోభానాగిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఆమెను హైదరాబాదులోని ఓ కార్పోరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పక్కటెముకలు విరిగాయని, తలకు తీవ్రమైన గాయాలయ్యాయని అంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు.
ప్రమాదంలో ఇద్దరు గన్మన్, వాహనం డ్రైవర్ కూడా గాయపడ్డారు. వారికి ఆళ్లగడ్డ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి, ఆమె భర్త భూమా నాగిరెడ్డి నంద్యాల అసెంబ్లీ నుంచి వైయస్సార్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.