చంద్రబాబుకు బిగ్ షాక్: మోడీతో లక్ష్మీపార్వతి భేటీ, దేనికి సంకేతం?
మోడీతో లక్ష్మీపార్వతి భేటీ చంద్రబాబుకు పెద్ద షాక్ ఇచ్చిందని అంటున్నారు. చంద్రబాబు ప్రత్యర్థులకు మోడీ ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తున్నారనే విషయం అంతు చిక్కడం లేదు.
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పెద్ద షాకే ఇచ్చారు. చంద్రబాబు అంటే భగ్గుమనే ఎన్టీఆర్ సతీమణి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతికి మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారు.
రెండు రోజుల క్రితం లక్ష్మీపార్వతి మోడీతో సమావేశమయ్యారు. సంచలనం సృష్టించే ఈ వార్త ఎక్కడా కనిపించలేదు. ఓ వెబ్సైట్ మాత్రం రాసింది. చంద్రబాబు ప్రత్యర్థులతో మోడీ ఎందుకు భేటీ అవుతున్నారనే విషయం ఎవరికీ అంతు బట్టడం లేదు.
టిడిపి, బిజెపి మధ్య స్నేహం బీటలు వారుతుందనే వార్తలు వస్తున్నప్పటికీ అది అంత సులభంగా తెగిపోయే బంధం కాదని ఎప్పటికప్పుడు వెంకయ్య నాయుడి వంటి నేతల మాటల వల్ల అనుకోవాల్సి వస్తోంది. అయితే, మోడీ అంతంగం ఏమిటో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పే ఆలోచన మోడీకి ఉందా అనే అనుమానాలు తాజా సంఘటన వల్ల కలుగుతున్నాయి.
ఏడాదిగా చంద్రబాబుకు నో...
తనను కలవడానికి ఏడాది కాలంగా మోడీ చంద్రబాబుకు అవకాశం ఇవ్వడం లేదని అంటున్నారు. అయితే, చంద్రబాబు ప్రత్యర్థులకు మాత్రం మోడీతో భేటీకి అవకాశం లభిస్తోంది. ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదు అనేది ప్రధాని ఇష్టమే అయినప్పటికీ చంద్రబాబుకు అసంతృప్తి కలిగించే ఆ భేటీలకు మోడీ సిద్ధపడడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. లక్ష్మీపార్వతి తాజాగా మోడీతో భేటీ కావడం చంద్రబాబుకు షాక్ ఇచ్చే విషయమే.
Recommended Video
ఏకాంతంంగా కలవడానికి....
చంద్రబాబును ఏకాంతంగా కలవడానికి మోడీ ఇష్టపడడం లేదని అంటున్నారు. ముఖాముఖి భేటీకి చంద్రబాబు ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల గుజరాత్లో జరిగిన టెక్స్ టైల్స్ షోకు ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి అచ్చెన్నాయడు హాజరు కావాల్సి ఉండింది. అయితే, మోడి వస్తున్నారని తెలియగానే చంద్రబాబు వెళ్ళారు. అయితే, మోడీ చంద్రబాబును కలవడానికి ఇష్టపడలేదని అంటున్నారు
జగన్తో గంట పాటు...
చంద్రబాబు అమెరికా వెళ్లడానికి ముందు ప్రధాని మోడీని కలవడానికి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లభించలేదని సమాచారం. అయితే, చంద్రబాబు అమెరికాలో ఉండగానే మోడీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తో దాదాపు గంట పాటు ముచ్చటించారు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులను తీవ్రమైన అసంతృప్తికి గురి చేసింది. జగన్ను కలవడంపై మోడీని వాళ్లు తప్పు పట్టారు కూడా. దీంతో బిజెపి, టిడిపి మధ్య వివాదం చోటు చేసుకుంది. చంద్రబాబు కలుగజేసుకుని వివాదానికి తెర దించారు.
లక్ష్మీపార్వతికి అపాయింట్మెంట్...
లక్ష్మీపార్వతికి మోడీ అపాయింట్మెంట్ ఇప్పించిదెవరనేది కూడా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆ విషయం తెలియక టిడిపి నేతలు మథనపడుతున్నారు. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని కోరడానికి లక్ష్మీపార్వతి మోడీని కలిసినట్లు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు పేరెత్తితే లక్ష్మీపార్వతికి అరికాలి మంట నెత్తికెత్తుతుంది. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి మోడీకి ఫిర్యాదు చేసినా చేయవచ్చుననే మాట వినిపిస్తోంది.
చక్రం తిప్పుతున్న విజయసాయి....
ఢిల్లీలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. చంద్రబాబుకు ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి పనిచేస్తున్నట్లుగా వైయస్ జగన్కు విజయసాయి రెడ్డి చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. మోడీ మనసును జగన్కు అనుకూలంగా మార్చడంలో విజయసాయియ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. బహుశా, ఆయనే లక్ష్మీపార్వతికి మోడీ అపాయింట్మెంట్ ఇప్పించి ఉండవచ్చునని అంటున్నారు.
జగన్కు ముందే....
కేంద్రంలో జరిగే పరిణామాలు చంద్రబాబు కన్నా ఇప్పుడు జగన్కే ముందు తెలుస్తున్నాయని కూడా అంటున్నారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా రామనాథ్ కోవింద్ను ఎంపిక చేస్తున్నట్లు జగన్కు ముందే తెలుసునని, అందుకే ముందే ఆయన కోవింద్ను కలిశారని అంటున్నారు. విజయసాయి రెడ్డితో కలిసి జగన్ కోవింద్కు పాదాభివందనం చేయడం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మలుపు తిరుగుతాయనే సంకేతాలను ఇస్తోందని అంటున్నారు.