హోం మంత్రి వనిత నియోజకవర్గంలో టీడీపీ గెలుపు - కొత్త టెన్షన్..!!
వైసీపీ వర్సస్ టీడీపీ. ఇప్పుడు ఏ ఎన్నిక జరిగినా..రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ బోర్డు ఎన్నికలలోనూ రెండు పార్టీల మద్దతు దారుల హంగామా కనిపించింది. అక్కడ జరిగిన ఎన్నికల తీరు పైన స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పోలీసుల సాయంతో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఆ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేసారు.
హోం మంత్రి నియోజకవర్గంలో
ఇక, ఇప్పుడు హోం మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు లో కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలక మండలి ఎన్నికలు జరిగాయి. మొత్తం 11 స్థానాల్లో టీడీపీ మద్దతు దారులు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, మంత్రి సొంత నియోజకవర్గం కావటంతో ఇప్పుడు అక్కడ టీడీపీ ఏకపక్ష గెలుపు చర్చకు కారణమైంది. ఈ ఎన్నికల తీరు పైన కొందరు అధికారులకు ఫిర్యాదులు చేసారు. వైసీపీ నేతలు మాత్రం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారంటూ జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేసారు.
వైసీపీలో గ్రూపు రాజకీయాలతో
దీంతో..ఉన్నతాధికారులు ఈ ఎన్నిక జరిగిన తీరు గురించి వివరాలు సేకరిస్తున్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లోనూ ఈ బ్యాంకులో టీడీపీ తరపున పాలకవర్గం ఎన్నిక అవుతోంది. కానీ, ఇక్కడి వైసీపీ నేతలు కొందరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణమాల పైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీలో చోటు చేసుకుంటున్న గ్రూపు రాజకీయాలతో టీడీపీ లాభపడుతోందని వైసీపీ కౌన్సిలర్ బహిరంగంగానే ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నా..వైసీపీ గ్రూపుల కారణంగా టీడీపీ బలపడుతోందని చెప్పుకొచ్చారు.
వైసీపీ హైకమాండ్ ఫోకస్
ఒక బ్యాంకు పాలక వర్గం ఎన్నికల్లోనే వైసీపీ నేతలు ఐక్యంగా పని చేయని సమయంలో.. నియోజకవర్గ ఎన్నికల్లో ఐక్యంగా ఉండగలరా అనే చర్చ నియోజకవర్గంలో మొదలైంది. ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాల పైన వైసీపీ అధినాయకత్వం సైతం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ ఎన్నిక అయినా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వైసీపీ..ఇలా టీడీపీ ఏకపక్షంగా అన్ని పదవులు దక్కించుకోవటంతో..దీని పైన చర్చ మొదలైంది.