పొన్నాలకి షాక్, భార్యకి దక్కలేదని భర్త సూసైడ్యత్నం
హైదరాబాద్/వరంగల్: జనగామ మున్సిపాలిటీ ఎన్నిక ఆసక్తికరంగా కొనసాగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గం అయినా జనగామలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించినప్పటికీ చైర్మన్ పదవి దక్కించుకోలేక పోయింది.
ఇక్కడ కాంగ్రెస్ 14, తెరాస 06 కౌన్సిలర్లను మాత్రమే గెలుపొందాయి. తెరాసకు బీజేపీ (4), సీపీఎం(1), ఇండిపెండెంట్లు (3)మద్దతు నివ్వడంతోపాటు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే, ఎంపీల ఓట్లు కూడా రావడంతో చైర్మన్ కుర్చీని తెరాస గెలుచుకుంది.
భార్యకు చైర్మన్ గిరీ దక్కలేదని భర్త ఆత్మహత్యాయత్నం
వరంగల్ జిల్లా జనగామ మున్సిపల్ చైర్మన్ పదవి దక్కలేదన్న మనస్థాపంతో పట్టణ తెరాస అధ్యక్షుడు ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిల సమక్షంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వరంగల్ జిల్లా జనగామ మున్సిపల్ చైర్మన్ పదవికి తెరాస నుంచి గాడిపల్లి ప్రేమలతా రెడ్డి, బండ పద్మ పోటీపడగా పార్టీ అధిష్ఠానం ప్రేమలతా రెడ్డికి చైర్మన్ పదవిని కట్టబెట్టింది.
ఎంపీ, ఎమ్మెల్యేలు, బీజేపీ, సీపీఎం, ఇండిపెండెంట్ సభ్యుల మద్దతుతో ప్రేమలతా రెడ్డి చైర్మన్గా గెలుపొందారు. మున్సిపల్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఎంపీ, ఎమ్మెల్యే, చైర్మన్గా ఎన్నికైన ప్రేమలతా రెడ్డి విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో బండ పద్మ భర్త, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు బండ యాదగిరి రెడ్డి అక్కడికి వచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజీనామా పత్రం అందించి హఠాత్తుగా తనతోపాటు తెచ్చుకున్న సీసాలోని కిరోసిన్ను ఒంటిపై చల్లుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు.
6 వార్డు నుంచి గెలిచిన తన భార్య పద్మకు చైర్మన్ పదవి దక్కలేదని, 13 ఏళ్లుగా ఉద్యమంలో పనిచేసి జైలుకు కూడా వెళ్లినప్పటికీ తనకు తీరని అన్యాయం జరిగిందని యాదగిరి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో వెంటనే అప్రమత్తమైన ఎంపీ, ఎమ్మెల్యేలు ఆత్మహత్యాయత్నాన్ని నివారించి యాదగిరి రెడ్డిని సముదాయించారు. నామినేటెడ్ పదవులలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.