వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ఝలక్...టికెట్ రేసులో మండిపల్లి
కడప:రాయచోటి వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రేసులో తానూ ఉన్నట్లు రాయచోటి వైసీపీ నియోజకవర్గ నేత మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
స్థానిక వైసిపి నేత అనారోగ్యానికి గురికావడంతో పరామర్శించేందుకు వచ్చిన సందర్భంలో వైకాపా నేత మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఈ విధమైన ప్రకటన చేయడం కలకలం రేపింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గ స్థానం నుంచి తాను పోటీలో ఉంటానని మండిపల్లి స్పష్టం చేశారు. దీంతో ఈ విషయమై వీలైనంత త్వరగా వైసిపి అధినేత జగన్ వద్దే తేల్చుకోవాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే...
రాయచోటి వైసీపీ నియోజకవర్గ నేత మండిపల్లి రాంప్రసాద్రెడ్డి శనివారం రామాపురం మండలంలోని రాచపల్లెకు చెందిన మేరా నాగన్న ను పరామర్శించారు. మేరా నాగన్న అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న రాంప్రసాద్రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ నాయకులు చేస్తున్న ఉక్కు దీక్ష దండగని, వైఎస్ జగన్ సీఎం అయితేనే కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ వస్తుందని మండిపల్లి ఈ సందర్భంగా చెప్పారు.
రాయచోటి నియోజకవర్గంలో ప్రజలు ప్రత్యామ్నాయంగా మూడవ వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారని, అందువల్ల తాను 2019 ఎన్నికల్లో తప్పకుండా ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీలో ఉంటానని మండిపల్లి తేల్చి చెప్పారు. ఈ విషయంలో తాను ఏ నాయకుడికి సపోర్టు చేసేదే లేదన్నారు. మరోవైపు మండిపల్లి వ్యాఖ్యలతో స్థానిక వైసిపి శ్రేణుల్లో కలకలం రేగింది. మండిపల్లి హఠాత్తుగా ఈ వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కి మింగుడుపడటం లేదని తెలిసింది. దీంతో ఈ విషయమై వీలైనంత త్వరలోనే తమ అధినేత జగన్ వద్ద స్పష్టత తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని సమాచారం.