కృష్ణా ట్రిబ్యునల్ లో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు!!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణ, గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో రెండు రాష్ట్రాలు ఒకదానిపై ఒకటి ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కృష్ణ ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఒక పిటిషన్ విచారణ జరగగా ఊహించని తీర్పు వెలువరించింది కృష్ణా ట్రిబ్యునల్.
కృష్ణా ట్రిబ్యునల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పై ఏపీ దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ ను కృష్ణ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది.

గత సంవత్సరం డిసెంబర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టిఎంసిల నికర జలాలను కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్రం ఉత్తర్వులు జారీ చేసిన అంశంపై ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసింది. తెలంగాణ 90 టీఎంసీల నీటిని వాడకుండా ఆపాలని ఏపీ ప్రభుత్వం తన ఫిర్యాదులో పేర్కొంది.
చిన్న నీటి వనరుల వినియోగం కింద మిగిలిన 45 టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్ళించే నీటిలో 45 టీఎంసీలు వినియోగించుకునే వెసులుబాటును చూపుతూ తెలంగాణ ఈ నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించింది. ఇక ఈ నిర్ణయం పై సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం తెలంగాణ 90 టిఎంసిల నీటిని వినియోగించకుండా ఆపాలని ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ ను దాఖలు చేసింది.
అయితే ఈ అప్లికేషన్ ను విచారించే అధికారం తమకు లేదని, ఇందుకు తగిన వేదికలను ఆశ్రయించాలని కృష్ణా ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ జారీ చేసిన 246 జీవోపై కృష్ణా ట్రిబ్యునల్ లో ఏపీ వేసిన కేసుపై తీర్పు వెలువరించిన కృష్ణ ట్రిబ్యునల్ ఈ అంశం తమ పరిధిలో లేదని, సరైన ఫోరంలో తేల్చుకోవాలని చెపుతూ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును కొట్టివేసింది.












Click it and Unblock the Notifications