రాజధాని ప్రాంత రైతులకు షాక్ మీద షాక్, బాబు సహపంక్తి భోజనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు కొత్త సమస్య వచ్చి పడింది. రుణమాఫీ బకాయిలు ఉన్న రైతుల బ్యాంకు అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. రుణాలు చెల్లిస్తేనే లావాదేవీలు కొనసాగిస్తామని బ్యాంకర్లు చెప్పడం గమనార్హం. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని భూమి కోసం రైతులు 30వేల ఎకరాలు ఇచ్చారు. అయితే, ఈ భూములకు సంబంధించిన విద్యుత్ బకాయిలను తక్షణం చెల్లించాలని, లేకుంటే దాన్ని ఇంటి విద్యుత్ కనెక్షన్ల బిల్లులో కలిపేస్తామని, అప్పుడూ కట్టకుంటే ఇంటికి విద్యుత్ కనెక్షన్ నిలిపివేస్తామని విద్యుత్ శాఖ అధికారులు పంపుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.
విద్యుత్ కనెక్షన్లు రద్దు చేయించుకోనందున నెలనెలా కనీస బిల్లు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారని అంటున్నారు.
భూములు ఇచ్చాక.. వ్యవసాయ బిల్లులతో పనేమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై వారు సీఆర్డీఏ అధికారులను ఆశ్రయించారు. ఈ సమస్యను సిఎం దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యను తీర్చనున్నారని తెలుస్తోంది. కాగా, మొత్తం 4,700 మంది రైతులకు రూ.2 కోట్ల విలువైన బిల్లులు వచ్చినట్లుగా సమాచారం.
దళిత నేత ఇంట్లో చంద్రబాబు సహపంక్తి భోజనం
చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడి బిజీబిజీగా గడిపారు. కుప్పంలో ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం అనిగానిపల్లెలో దళిత నేత మునికృష్ణ నివాసంలో సహపంక్తి భోజనం చేశారు.
పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, పేదవాళ్లకు అండగా ఉంటామని చంద్రబాబు అంతకుముందు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.
ధరల నియంత్రణకు చర్యలు తీసకున్నామన్నారు. కుటుంబలో ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. చెరువుల్లో పూడిక తీయటం అందరి బాధ్యత అన్నారు. నదుల అనుసంధానం కార్యక్రమం చేపట్టామని, గోదావరి నదిని కృష్ణాతో అనుసంధానం చేసి రాయలసీమకు నీళ్లిస్తామన్నారు. రాజధాని రైతులకు ఉదారంగా పరిహారం ఇచ్చామన్నారు.