టీడీపీకి మరో షాక్... మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా...
ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్నవారికి తగిన గుర్తింపు లభించట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చకనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 22 ఏళ్లుగా టీడీపీలో పనిచేశానని... పార్టీని వీడటం బాధాకరంగానే ఉందని అన్నారు.
ఏడాదిన్నరగా పార్టీ తనను దూరం పెడుతూ వస్తోందని శోభా హైమావతి పేర్కొన్నారు. తన కూతురు స్వాతి వైసీపీలో చేరడం వల్లే తనను దూరం పెట్టినట్లు చెబుతున్నారని అన్నారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ నుంచి కూడా తన పేరు తొలగించారని... టీడీపీ కార్యక్రమాలకు తనను పిలవట్లేదని వాపోయారు. గౌరవం లేని చోట ఉండకూడదనే బాధతోనే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. ఇవాళ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించనున్నట్లు తెలిపారు.ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల టీడీపీ అధినేత చంద్రబాబును నేరుగా కలిసి మాట్లాడలేకపోయానని చెప్పారు.
భవిష్యత్ కార్యాచరణపై తన సన్నిహితులు,మద్దతుదారులతో సమాలోచనలు జరిపి నిర్ణయం తీసుకుంటానని హైమావతి తెలిపారు.శోభా హైమావతి గతంలో విజయనగరం జిల్లాలోని ఎస్.కోటా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. టీడీపీలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు.
కూతురు స్వాతి ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేపథ్యంలో హైమావతి కూడా వైసీపీలో చేరవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో బలహీనపడ్డ టీడీపీకి ఇది మరో షాక్ అనే చెప్పాలి. గడిచిన రెండున్నరేళ్లలో చాలామంది నేతలు టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. మొదట ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి,సీఎం రమేశ్,టీజీ వెంకటేశ్,గరికపాటి రామ్మోహన్ రావు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు.ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ,మద్దాలగిరి,కరణం బలరాంలు కూడా పార్టీని వీడారు. ఇలా కీలక నేతలంతా పార్టీని వీడటంతో పార్టీ డీలా పడినట్లయింది.