ట్విస్ట్ల మీద ట్విస్ట్లు: తిరగబడ్డ జగన్ వ్యూహం, మళ్లీ భూమా షాక్!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తులను తెలుగుదేశం పార్టీ చిత్తు చేసిందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గౌరు చరిత భర్త వెంకట రెడ్డిని .
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తులను తెలుగుదేశం పార్టీ చిత్తు చేసిందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గౌరు చరిత భర్త వెంకట రెడ్డిని రంగంలోకి దించాలన్న జగన్ వ్యూహాత్మక అడుగులను టిడిపి చిత్తు చేసిందా ? అంటే అవుననే అంటున్నారు.
శిల్పా చక్రపాణి రెడ్డిని రంగంలోకి దింపి జగన్ వ్యూహానికి టిడిపి చెక్ చెప్పిందని అంటున్నారు. భూమా నాగిరెడ్డి వైసిపి నుంచి టిడిపిలో చేరినప్పటి నుంచి కర్నూలులో భూమా వర్గీయులు శిల్పా వర్గీయుల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి నుంచి ఎవరికి టిక్కెట్ దక్కుతుందనే చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా.. భూమాను ఒప్పించి, శిల్పా చక్రపాణికి అవకాశం కల్పించారు. చక్రపాణికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వడంతో.. ఇటు శిల్పా వర్గీయులు చల్లబడగా, అటు భూమా వర్గం మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడింది.

తిరగబడిన జగన్ వ్యూహం!
కర్నూలు జిల్లా టీడీపీలోని వర్గాల మధ్య అగాధం మరింత పెంచేందుకు జగన్ ఎత్తుగడ వేశారని, కానీ అది వికటించిందని అంటున్నారు. ఆయన వేసిన పాచిక టీడీపీలోని శిల్పా, భూమా వర్గాల మధ్య దూరం పెంచడానికి బదులు వారిని దగ్గర చేసిందని టిడిపిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మలుపులు
జిల్లాలో స్ధానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ నుంచి గౌరు వెంకటరెడ్డి పేరును జగన్ తెరపైకి తీసుకు వచ్చారు. అది వ్యూహాత్మకమే అంటున్నారు. అది అనేక మలుపులకు దారి తీసింది. కర్నూలు జిల్లాలో శిల్పా చక్రపాణి రెడ్డి సోదరులు, భూమా నాగిరెడ్డి మధ్య విభేదాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మె ల్సీ ఎన్నికలు వచ్చాయి.

మరోసారి అవకాశం.. చేతులెత్తేసిన వైసిపి రంగంలోకి
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న చక్రపాణి రెడ్డి రిటైరవుతున్నారు. ఖాళీ అయిన సీటుకు ఆయన ఎన్నిక కావడంతో రెండేళ్లలోనే రిటైర్ కావాల్సి వచ్చింది. మళ్లీ ఆయన్నే కొనసాగించాలని టీడీపీ నాయకత్వం భావించింది. పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో వైసీపీ కూడా మొదట చేతులెత్తేసింది. అయితే అనూహ్యంగా గౌరు వెంకట రెడ్డి పోటీలోకి వచ్చారు. ఆయన వైసీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత భర్త.

అంతా రివర్స్
వెంకట రెడ్డిని పోటీలోకి దించుతున్నట్లు వైసిపి ప్రచారంలోకి తెచ్చింది. గౌరు వెంకట రెడ్డి బావమరిది శివానంద రెడ్డికి టికెట్ ఇస్తే వెంకట రెడ్డి పోటీ నుంచి ఉపసంహరించుకొని ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరిస్తారనే ప్రతిపాదన.. వైసిపి నుంచి కాకుండా గౌరు కుటుంబం నుంచి వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. శివానంద రెడ్డి ఎమ్మెల్సీ అయితే భవిష్యత్తులో గౌరు కుటుంబం కూడా టిడిపిలోకి రావడానికి అవకాశం ఉందన్న సంకేతాలు ఇచ్చారట. తద్వారా శిల్పా చక్రపాణి రెడ్డికి టిడిపి నుంచి ఎమ్మెల్సీ టిక్కెట్ రాకుండా చేయాలని భావించారని అంటున్నారు.

వైసిపి అలా అంచనా వేసింది..
ఇప్పటికే భూమా చేరికతో శిల్పా వర్గం ఆవేదనతో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోను శిల్పా వర్గీయులకు చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకుంటే వారు అలక వహించి టిడిపిని వీడుతారని వైసిపి భావించిందని అంటున్నారు. శిల్పా సోదరులకు మిగిలింది వైసిపి మాత్రమే అని, కాబట్టి వారు తమ పార్టీలో చేరుతారని వైసిపి నేతలు అంచనా వేశారని అంటున్నారు. శిల్ప - భూమా వర్గం మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో సహకరించుకోరనే అభిప్రాయం టిడిపి అధిష్టానంలోను ఉంటుందని వైసిపి భావించిందట.

సమన్వయం
వైసిపి ఉద్దేశ్యాన్ని పసిగట్టిన టిడిపి వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని అంటున్నారు. సోమవారం ఉదయం ఆయన ఆ జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడితో మాట్లాడారు. అనంతరం చక్రపాణి రెడ్డి పేరును ప్రకటించారు. అచ్చెన్నాయుడు వెళ్లి భూమా - శిల్పా వర్గీయులతో మాట్లాడి సమన్వయం చేశారు.

జగన్కు భూమా షాక్!
మీరు చక్రపాణికి సహకరించరనే ఉద్దేశ్యంతో వైసిపి పోటీ పెడుతోందని, అలాంటి పరిస్థితి రానివ్వవద్దని అచ్చెన్నాయుడు.. భూమా నాగిరెడ్డికి సూచించారు. చక్రపాణికి సహకరించాలని కోరారు. భూమా కూడా ఓకే చెప్పారు. అనంతరం శివానంద రెడ్డి కూడా పిలిపించి మాట్లాడారు. దీంతో చక్రపాణి రెడ్డికి మార్గం సుగమం అయి.. టిడిపిలో విభేదాలు ప్రస్తుతానికి సమసిపోయాయి.












Click it and Unblock the Notifications