మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు!
ఇప్పటికే వివాదాలలో చిక్కుకున్న మంత్రి కొండ సురేఖ మాజీ ఓ ఎస్ డీ పైన తాజాగా హత్యాయత్నం కేసు నమోదయింది. గతంలో మంత్రి కొండా సురేఖ వద్ద పనిచేసిన మాజీ ఓఎస్డి సుమన్ బోడుప్పల్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ పైన దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సుమంత్ పైన కేసు నమోదు చేశారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కొండా సురేఖ మాజీ ఓఎస్డీ దాడి
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం సుమంత్ బోడుప్పల్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హరికృష్ణను కలవాలని ఫోన్ చేశాడు. అయితే ఆ సమయంలో తాను అందుబాటులో లేకపోవడంతో హరికృష్ణ తర్వాత కలుస్తానని చెప్పాడు. ఆ తర్వాత హరికృష్ణ స్నేహితుడైన రాము కార్యాలయానికి వెళ్ళగా అక్కడకు సుమంత్ వచ్చాడు. నా పేరు ఉపయోగించుకుని బయట ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నావ్ అని ప్రశ్నిస్తూ హరికృష్ణ పైన దాడికి తెగబడ్డాడు.

ఇనుప రాడ్డుతో దాడి చేసి చంపేస్తామని హెచ్చరిక
తాను ఎలాంటి డబ్బులు వసూలు చేయలేదని చెప్పినప్పటికీ దుర్భాషలాడుతూ ఇనప రాడ్డుతో కాళ్లు, చేతులపై దారుణంగా దాడి చేశాడు. ఆపై తన అనుచరులను ఉసిగొలిపి హరికృష్ణ ను చంపేందుకు ప్రయత్నించాడని, ఈ విషయాన్ని బయటకు చెబితే ప్రాణాలు తీస్తామని బెదిరించినట్టు హరికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తీవ్రంగా గాయపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు
ఈ దాడిలో హరికృష్ణ ఎడమ చేతికి ఫ్రాక్చర్ కాగా, అతను తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో పాటు రక్తపు వాంతులు అయ్యాయి. దీంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో ఆగస్టు 10వ తేదీన హరికృష్ణ చేతికి శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం తనకు ప్రాణహాని ఉందని, ఫిర్యాదు చేయడంలో తను ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆలస్యమైందని హరికృష్ణ చెబుతున్నారు.
హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
ముందుగా మేడిపల్లి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ ఘటనలో సుమంత్ తో పాటు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాము తదితరుల పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు దీనికి సంబంధించి కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.













Click it and Unblock the Notifications