జగన్కు షాక్: టిడిపిలోకి బూరగడ్డ వేదవ్యాస్, లోకేష్ కారణంగానే?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృష్ణా జిల్లాలో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నాయకుడు బూరగడ్డ వేదవ్యాస్ తెలుగుదేశం గూటికి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్కు, వేదవ్యాస్ తనయుడు కిషన్తేజ్కు మధ్య స్నేహం దానికి దారి తీసినట్లు చెబుతున్నారు.
2014 ఎన్నికలకు ముందే వేదవ్యాస్ తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి ఆయనకు ఆహ్వానం కూడా అందినట్లు వార్తలు వచ్చాయి. ఏమైందో తెలియదు గానీ ఆయన అనూహ్యంగా పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీచేశారు.

కానీ, తెలుగుదేశం అభ్యర్థి కాగిత వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జగన్కు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. ఈ స్థితిలో ఆయన గురువారం తన అనుచరులతో సమావేశమయ్యారు.
మల్లేశ్వరం శాసనసభా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రెండు సార్లు గెలిచారు. 1993-94 మధ్య డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. 2009లో కాంగ్రెసును వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. మచిలీపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై పోటీ చేసి ఓడిపోయారు.
ప్రజారాజ్యాం పార్టీ కాంగ్రెసులో విలీనమైన తర్వాత కొంత కాలం పాటు ఆ పార్టీలో కొనసాగి 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. లోకేష్ చొరవతో వేదవ్యాస్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications