కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు: రాజీనామా చేస్తాం.. జగన్కు సొంత పార్టీ నేతల షాక్
విజయవాడ: తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెడతామన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్. సొంత పార్టీ నాయకులే దీనిపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర రాజకీయ సలహాదారు ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లా పేరు మార్పును తాము వ్యతిరేకిస్తున్నామని వైసీపీ రాష్ట్ర రాజకీయ సలహాదారు దుట్టా రామచంద్ర రావు అన్నారు. ఎంతోమంది జీవనాధారమైన కృష్ణా నది పేరు మార్చితే సహించేది లేదని అల్టిమేటం జారీ చేశారు. జగన్ తాను ఇచ్చిన హామీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జగన్ తగ్గకుంటే రాజీనామా
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానన్న జగన్ ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోని పక్షంలో తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తానని దుట్టా రామచంద్ర రావు హెచ్చరించారు.

నెటిజన్ల స్పందన
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే అంశంపై జగన్ ట్విట్టర్లోను స్పందించారు. దీనిపై సోషల్ మీడియాలోను వ్యతిరేకత వచ్చింది. పరమ పవిత్రమైన కృష్ణవేణీ నదీమతల్లి పేరు మార్చినవారు కనకదుర్గమ్మ అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదని ఓ నెటిజన్ పేర్కొన్నారు.

నెటిజన్ల మెచ్చుకోలు, విమర్శలు
ఇది అద్భుమని, చూడటానికే కాదు.. మీ మనసు కూడా చాలా మంచిదని మరో నెటిజన్ జగన్ను ప్రశంసించారు. మీ నాన్న శంషాబాద్ విమానాశ్రయం పేరును రాజీవ్ గాంధీ పేరు మీదకు మార్చారని మరొకరు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఆపోజిషన్ పార్టీ టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పడం హర్షణీయమని మరొకరు అన్నారు. ఎన్టీఆర్ ఒక్క జిల్లాకు పరిమితమయ్యే వ్యక్తి కాదని మరో నెటిజన్ స్పందించారు.

చంద్రబాబుపై అంబటి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా రాకపోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు పెట్టాల్సింది బహిరంగ సభలు కాదని, బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. ధర్మ పోరాట సభల్లో గతంలో హోదా వద్దన్న వీడియోలు కూడా ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications