నిద్రలోనే మరణించిన కొడుకు, తల్లి షాక్ : మూడు రోజులు డెడ్ బాడీ ఇంట్లోనే .. ఏపీలో ఘటన
నవమాసాలు మోసి కన్న కొడుకు నిద్రలోనే మృతి చెందడంతో ఓ తల్లి షాక్ కు గురైంది. ఏం చేయాలో అర్థం కాక మూడు రోజులుగా శవాన్ని ఇంట్లోనే ఉంచి దీనంగా రోదిస్తూ కూర్చుంది. మృతదేహం కుళ్లి దుర్వాసన రావడంతో అనుమానించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించగా ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వీడు ఓ తండ్రేనా .. ఐదేళ్ళ కూతురిపై కామ వాంఛ తీర్చుకున్న మానవ మృగం ; విజయవాడలో దారుణం
నెల్లూరు జిల్లాలో ఘటన .. లేట్ గా నిద్రలేపమన్న కొడుకు
నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళితే నెల్లూరు ఫత్తేఖాన్ పేట తామర వీధికి చెందిన వెంకట రాజేష్ అని 37 సంవత్సరాల వ్యక్తికి రెండేళ్ల క్రితమే వివాహమైంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న వివాదాల కారణంగా భార్య భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రాజేష్ అతని తల్లి విజయలక్ష్మితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవల తో రాజేష్, అతని తల్లి విజయలక్ష్మి తీవ్ర మనోవేదన తో ఉన్నారు. అయితే ఈ నెల 5వ తేదీన తనను కాస్త లేటుగా నిద్ర లేపాలని తల్లికి చెప్పి రాజేష్ పడుకున్నాడు .
ఎంత నిద్ర లేపినా లేవని కొడుకు.. మృతి చెందాడని గుర్తించి తల్లి షాక్
ఆరవ తేదీ రాజేష్ ని నిద్రలేపడానికి ప్రయత్నించిన తల్లి అతను ఎంతకూ నిద్ర లేవకపోవడంతో, పడుకుంటాడులే అని వదిలేసింది. ఆరో తేదీ సాయంత్రం నిద్రలేపడానికి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ రాజేష్ నిద్ర లేవకపోవడంతో కొడుకు మృతి చెందాడని గుర్తించిన తల్లి అక్కడే కుప్పకూలిపోయింది. తల్లి కొడుకులు ఇద్దరు మాత్రమే నివసించే ఇంట్లో, కొడుకు మృతితో షాక్ తిన్న తల్లి దీనంగా మృతదేహం పక్కనే కూర్చుని విలపిస్తూ ఉండిపోయింది. ఇలా మూడు రోజుల పాటు ఆ తల్లి కొడుకు కోసం కన్నీరు మున్నీరుగా రోదిస్తూ అక్కడే ఉంది. కనీసం బయటకు వచ్చి ఎవరికీ తన కొడుకు మృతి చెందాడని చెప్పలేకపోయింది. ఎవరికైనా ఫోన్ చెయ్యాలనే ఆలోచన కూడా ఆ తల్లికి రాలేదు.
కుళ్ళి దుర్వాసన వస్తున్నా.. మూడు రోజులు మృతదేహంతో రోదిస్తూనే ఉండిపోయిన తల్లి
దీంతో రాజేష్ మృతదేహం మూడు రోజులపాటు ఇంట్లోనే ఉండటంతో కుళ్లిపోయి దుర్వాసన రావడం మొదలైంది. ఇక విజయ లక్ష్మి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో గుర్తించిన ఇరుగుపొరుగువారు ఆమె ఇంటికి వెళ్లి లోపల పరిస్థితిని చూసి షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజేష్ మృతదేహం కుళ్లిన స్థితిలో ఉన్నట్లుగా గుర్తించి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి సోదరుడు రమేష్ ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ కేసు నమోదు చేశారు.
కొడుకు మరణం జీర్ణించుకోలేక షాక్ లో ఉన్న తల్లి .. పోలీసుల దర్యాప్తు
రాజేష్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడని, అనారోగ్య కారణాలతో మృతిచెందాడని మృతుడి సోదరుడు పోలీసులకు వెల్లడించారు. ఇక తల్లి మాత్రం కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక అంతే షాక్ లో దీనంగా రోదిస్తూ ఉండిపోయింది. రాజేష్ అంటే తల్లికి వల్లమాలిన ప్రేమ. దీంతో ఆ తల్లి కుమారుడి మరణం నుండి కోలుకోలేకపోతుంది. చిన్నప్పటినుండి ఎంతో ప్రేమగా చూసుకున్న కొడుకు అచేతనంగా పడి ఉండటంతో షాక్ కు గురైన తల్లి మూడు రోజులపాటు మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని, కొడుకుని చూస్తూ రోదించింది.
Recommended Video
తల్లి మానసిక స్థితిపై ఆందోళన .. మూడు రోజులు మృతదేహం వద్ద కొడుకు కోసం విలపించిన అమ్మ మనసు
ఈ క్రమంలో తల్లి ఆరోగ్య పరిస్థితి, మానసిక స్థితి ఆందోళనకరంగా ఉందని గుర్తించిన పోలీసులు తల్లిని కూడా వైద్యులకు చూపించి చికిత్స చేయించడం అవసరమని కుటుంబ సభ్యులకు సూచించారు. ఏదేమైనప్పటికీ నెల్లూరు నగరంలో చోటు చేసుకున్న ఈ సంఘటన విన్న వారి మనసులను కలచివేస్తోంది. కొడుకు కోసం ఆ తల్లి అనుభవించిన బాధ ప్రతి ఒక్కరికి ఆవేదన కలిగిస్తోంది. మృతదేహం కుళ్లి దుర్వాసన వస్తున్నా సరే కొడుకునే చూసి రోదించిన తీరు అమ్మ మనసుకు అద్దం పడుతుంది.