కాల్ మనీ షాక్, హైదరాబాద్కు లింక్: ఎలక్ట్రానిక్ కంపెనీ సీఈవో మహేష్ అరెస్ట్!
విజయవాడ/హైదరాబాద్: ఏపీలో వెలుగు చూసిన కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ సీఈవోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు మహేష్. ఆయన ప్రముఖ కంపెనీ డిస్ట్రిబ్యూటర్గా వార్తలు వస్తున్నాయి.
విజయవాడలో కాల్ మనీ - సెక్స్ రాకెట్ ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ రాకెట్లో ఎలక్ట్రానిక్ కంపెనీ సీఈవో మహేష్ పేరు వెలుగు చూడటం గమనార్హం. రెండు రోజుల క్రితం కాల్ మనీ బాధితులు అతనిని కలిసినట్లగా తెలుస్తోంది.
కాల్ మనీ నిందితుల ఫోన్లను ట్రేస్ చేయడం ద్వారా అతని గురించి పోలీసులకు తెలిసిందని సమాచారం. హైదరాబాదులో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బెజవాడకు తరలిస్తున్నారు.
కాల్మనీ దాష్టీకాలు
కృష్ణలంక ప్రాంతంలో ప్రజలను బెదిరింపులకు భయాందోళనలకు గురి చేస్తున్న శివ కుమార్ అనే కాల్మనీ వడ్డీ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. శివ కుమార్ మహిళలను బెదిరిస్తున్నాడని పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్కు ఫిర్యాదులు అందాయి.
ఆయన ఆదేశం మేరకు కృష్ణలంక సీఐ... ఈ నెల 17న నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇతని తమ్ముడు హత్యకు గురవ్వడంతో ప్రాణభయం ఉందంటూ పోలీసు గన్మెన్లను తెచ్చుకున్నాడు. వారి ద్వారా బెదిరింపులకు, కాల్మనీ వ్యాపారాలకు పాల్పడుతున్నట్లు తేలింది.
చర్యలు శృతిమించడంతో కొద్ది సంవత్సరాల కిందట ఇతనిపై రౌడీషీటు నమోదు చేసి, గన్మెన్ల రక్షణను తొలగించినట్లు సీఐ తెలిపారు. కృష్ణలంకతో పాటు గుంటూరులోనూ బెదిరింపులు, భూకబ్జాలు, సెటిల్మెంట్లు తదితర 11 కేసులు ఇతనిపై విచారణలో ఉన్నాయి.