చింటూకు బిగుస్తున్న ఉచ్చు: పన్ను ఎగవేత, విచారణలో 'దండుపాళ్యం' గ్యాంగ్
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లావాదేవీల పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి విచారణలో చింటూ పన్నుల ఎగవేత విషయం వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. విచారణలో దండుపాళ్యం ముఠా ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది.
కేసు విషయమై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. ప్రతి చిన్న ఆధారాన్ని కూడా సేకరిస్తున్నారు. గురువారం ఉదయం ఓ నిందితుడిని పోలీసు అధికారులు కోర్టు ముందు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు పదిమంది అరెస్టయ్యారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
నిందితుల నుంచి అన్ని కోణాల్లోను, కీలక ఆధారాలు ఆరా తీస్తున్నారు. చింటూ విచారణలో దండుపాళ్యం ముఠా సభ్యుడైన మంజు ప్రస్తావన వచ్చినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. పోలీసు అధికారులు వెంటనే మంజు నివాసంలో సోదాలు చేశారు.
అతనింట్లో అక్రమంగా ఉన్న నాలుగుకు పైగా నాటు తుపాకులు గుర్తించారు. వాటిని స్వాదీనం చేసుకున్నారు. ఈ హత్య కుట్రలో లాయర్ పాత్ర కూడా కీలకంగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారని సమాచారం. లాయర్ తన అనుచర బృందంతో చింటూకు సహాయ, సహకారాలను అందించినట్లు విచారణలో వెలుగు చూసింది.
హత్యలో సహకరించిన సుమారు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు, చింటూకు సంబంధించిన ఆర్థికలావాదేవీలపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా గురువారం యాదమరి మండలంలోని క్వారీని పోలీసు అధికారులు పరిశీలించారు.
అక్కడ ఉన్న క్వారీ వివరాలు, యంత్రాలు, లావాదేవీలను తనిఖీ చేశారు. చింటూ గత కొంత కాలం నుంచి పన్నులు చెల్లించకుండా ఎగవేస్తున్నట్లు గుర్తించారు. ఈ పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి సుమారు రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ఐటీ, ఈడీలకు సమాచారం అందించారు.