విజయవాడలో షాకింగ్ చోరీ: షార్ట్ ఫిల్మ్ చెయ్యాలని పిలిచారు; ఏకంగా కెమెరాలతోనే ఉడాయించారు
సమాజంలో మంచి వారెవరో, చెడ్డ వారెవరో తెలియకుండా పోతుంది. దొంగలకు, దొంగలు కాని వారికి కూడా తేడా అర్థం కాకుండా పోతుంది. నమ్మితే చాలు మోసం చేసే వాళ్ళు దేశవ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడ రెచ్చిపోతూనే ఉన్నారు. మంచిగా కనిపిస్తూనే మోసం చేస్తున్నారు. మోసగాళ్ల చేతిలో నిత్యం అమాయకులు మోసపోతూనే ఉన్నారు. తాజాగా విజయవాడలో అటువంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది.
Recommended Video
షార్ట్ ఫిల్మ్ పేరుతో ఘరానా మోసం
పక్కా ప్లాన్ తో ఘరానా మోసానికి స్కెచ్ వేసిన కేటుగాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా, చాలా తెలివిగా చేసిన చోరీ ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. ఇంతకీ విజయవాడలో జరిగిన ఘరానా మోసం ఏంటి? మోసపోయింది ఎవరు అనే వివరాల్లోకి వెళితే.. షార్ట్ ఫిల్మ్ తీయాలని ఓ వ్యక్తి హైదరాబాద్ నుండి విజయవాడకు కెమెరాలను పిలిపించాడు. అంతా ఓకే అనుకున్నాక డీల్ కుదిరాక హైదరాబాద్ కమలాపూర్ కాలనీ నుండి కేతావత్ నందు అనే కెమెరామెన్ షార్ట్ ఫిల్మ్ తీయడం కోసం కాస్ట్లీ కెమెరాలతో విజయవాడ కు చేరుకున్నాడు.
కెమెరా మ్యాన్ ను బురిడీ కొట్టించి ఊహించని షాక్
ఇక కెమెరామెన్ నందును రిసీవ్ చేసుకోవడానికి బస్టాండ్ కి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు నందుని కలిసి అతనిని అక్కడి నుండి ఓ ఆటోలో బందర్ రోడ్డు లోని సువర్ణ హోటల్ కు తీసుకువెళ్లారు. రూమ్ కి వెళ్ళిన తర్వాత కెమెరామెన్ ఫ్రెష్ అయ్యాక, అతడిని భోజనం చేసి రమ్మని మరీ పంపించారు. వారు రూమ్ లో ఉంటారని, కెమెరాలను అక్కడే వదిలి వెళ్ళిన నందుకు వారు షాక్ ఇచ్చారు. వారిని నమ్మి కెమెరాను కెమెరాలను రూమ్ లోనే వదిలివెళ్లిన నందు తిరిగి వచ్చి చూసి అవాక్కయ్యాడు.
20 లక్షల రూపాయల కెమేరాతో ఉడాయించిన కేటుగాడు
కెమెరామెన్ నందు భోజనానికి వెళ్లగానే రూమ్ లో ఉన్న 20 లక్షల రూపాయల విలువైన కెమెరాలతో షార్ట్ ఫిల్మ్ తియ్యాలని పిలిచిన వ్యక్తి ఉడాయించాడు. రూమ్ కి తిరిగి వచ్చి చూసిన నందు తన కెమెరాలు కనిపించకపోవడంతో పాటు, తనను షార్ట్ ఫిల్మ్ తీయడానికి పిలిచిన వ్యక్తి కూడా కనిపించకపోవడంతో అతనికి ఫోన్ చేశాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా రిప్లై లేకపోగా, ఫోను స్విచాఫ్ రావడంతో మోసపోయానని గుర్తించాడు. వెంటనే పోలీసులను సంప్రదించిన కేతావత్ నందు తన కెమెరాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు ... మోసగాళ్ళున్నారు జాగ్రత్త
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న గవర్నర్ పేట పోలీసులు సువర్ణ హోటల్లోని సిసి టివి ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. గతంలో ఇదే తరహాలో నెల్లూరులో కూడా కెమెరాల చోరీ జరిగింది. ఎంతో చాకచక్యంగా తెలివిగా ఎలాంటి రిస్క్ లేకుండా కేటుగాళ్లు రెచ్చిపోతున్న నేపథ్యంలో ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని, ఎవరిని ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, విలువైన వస్తువులు ఎవరికీ ఇవ్వద్దని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు పోలీసులు.
విపరీతంగా సమాజంలో పెరిగిపోతున్న నేరాలు, మోసాల పట్ల కాస్త అవగాహన ఉండాలని అంటున్నారు. లేకుంటే మోసపోవటం ఖాయమని చెప్తున్నారు. కొత్తవారి విషయంలోనే కాదు, ఎవరి విషయంలో అయినా మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అడుగడుగునా మోసగాళ్ళున్నారు జాగ్రత్త అంటున్నారు.